అఖిల ప్రియకు ‘న్యూ ఇయర్ డిన్నర్’ టెన్షన్
అఖిల ప్రియకు ఆళ్లగడ్డలో ప్రత్యర్థి తయారవుతున్నాడా?
టూరిజం మంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు ఒక చిక్కు సమస్య వచ్చిపడింది.
తాను మంత్రిగా ఉండగా, ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలలో మరొక వ్యక్తి లీడర్ గా తల ఎగరేయడం ఏమిటి? ఇది జరగడానికి వీళ్లేదని ఆమె నిర్ణయించుకున్నారు. అనుచరులందరికి చెప్పారు. ‘ఆ మనిషి’ కొత్త సంవత్సరం పేరుతో ఇస్తున్న ‘న్యూఇయర్ డిన్న ర్’ రాజకీయం సక్సెస్ కాకుండా చూడటం ఇపుడు ఆమె ముందున్న సవాల్.
ఇంతకీ ఆ మనిషి ఎవరో తెలుసా?
ఆయనే ఎవి సుబ్బారెడ్డి. ఆమె తండ్రి భూమానాగిరెడ్డి అనుంగు శిష్యుడు. భూమా హాయంలో కథ నడిపిందంతాసుబ్బారెడ్డే. నాగిరెడ్డి చనిపోవడంతో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. అయితే, ఇపుడ మా కథ మేం చూసుకుంటామని అఖిల ప్రియ అంటోంది. ఆయన పెత్తనం చలాయించకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. ఇది సుబ్బారెడ్డికి రాజకీయ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమ్. రాజకీయాల్లో ఒక శక్తిగా ఉండకుండా బతక లేమని, అందునా మంత్రి వ్యతిరేకిస్తున్నపుడు మనుగడ కష్టమని ఆయనకు బాగా తెలుసు. అందువల్ల ఆయన తనకూ బలముందని అధినేత చంద్రబాబు నాయుడికి చూపించుకుని నాలుగు పనులు సంపాయించుకోవాలి. నాలుగురూకలేరు కోవాలి అని తాపత్రయ పడుతున్నారు. అయితే, తన ఇలాకాలో మరొక నాయకుడు ఇండిపెండెంటుగా ఎదిగితే ఎలా అనేది అఖిల ప్రియ ధోరణి. ఈ క్లాష్ ఇపుడు బయటపడుతూ ఉంది. రేపు డిసెంబర్ 31న ఎవి సుబ్బారెడ్డి ఏర్పాటు చేసిన డిన్నర్ ఈ క్లాష్ కు వేదికగా మారింది. తనకు ఎంతబలముందో చూపించేందుకు ఏవీ సుబ్బారెడ్డి న్యూఇయర్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్టీకి రావాలంటూ నంద్యాల, ఆళ్లగడ్డ నేతలను ఆహ్వానించారు.
మంత్రికి కోపం
ఇది అఖిల ప్రియకు ఆగ్రహం తెప్పించింది. తనకు తెలియకుండా తన వూరు ఆళ్లగడ్డలోటిడిపి డిన్నర్ ఏమిటి? ఎవ్వరూ వెళ్లొద్దని అర్డర్ జారీ చేశారు. రెండు నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యేలా సుబ్బారెడ్డి చూస్తున్నారు. డిన్నర్ రాజకీయానికి వెళ్లాలా వద్దా అనేది టిడిపి నేతల పీడిస్తున్న ప్రశ్న. వెళ్లితే మంత్రితో సమస్య, వెళ్లకపోతే సుబ్బారెడ్డి తో సమస్య. వెళ్లాక ఏదయినా గొడవ జరిగితే ఎలా? ఇదే ఉత్కంఠ ఆళ్లగడ్డ, నంద్యాలలో.