వైసీపీ కండువా కప్పుకున్న యలమంచిలి
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి శనివారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కనకదుర్గమ్మ వారధి వద్ద వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పార్టీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. టీడీపీలో తనకు గౌరవం ఇవ్వకపోవడం వల్లే తాను వైసీపీలో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు.
‘2009లో ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే గా గెలిచాను. ఆ తర్వాత టీడీపీలో చేరాను. ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తున్నాను. టీడీపీలో ఉన్న మంత్రులు నన్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధకు గురిచేశాయి. అవే నేను పార్టీ మారడానికి దోహదపడ్డాయి. రైతు గర్జన సమయంలో కూడా మమ్మల్ని ఉపయోగించుకుని మాకు సీటు ఇస్తామని హామీ ఇచ్చి మళ్లీ మోసం చేశారు. టీడీపీలో నాకు గౌరవం ఇవ్వలేదు. మనస్తాపం చెందాను. నా తండ్రి లాగానే వివాదాలు లేకుండానే పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తాను. మా తాత దగ్గర నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాం. వైఎస్ జగన్ మాటకు కట్టుబడి ఉన్నాను’ అని యలమంచిలి రవి పేర్కొన్నారు.