అత్యాచారాలలో ఆ రాష్ట్రమే టాప్..!
అత్యాచార బాధితులంతా చిన్నారులే
తమిళనాడు రాష్ట్రం అత్యాచారాల్లో మొదటి స్థానంలో నిలిచింది. చైల్డ్ రైట్స్ అండ్ యు (సీఆర్వై) అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలపై ఈ సర్వే చేయగా.. తమిళనాడు ప్రథమ స్థానంలో నిలిచింది.
దీంతో చట్టాల అమలులో డొల్లతనం, పోలీస్శాఖ పనితీరు ఇట్టే స్పష్టమైపోతోందని పలువురు విద్యావేత్తలు ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో చిన్నారులపై మానభంగాలు ఐదురెట్లు పెరిగాయని ఆ సంస్థ ప్రకటించింది. 2011లో 271 మంది చిన్నారులపై అత్యాచారం కేసులు నమోదవ్వగా, 2016 నాటికి ఈ సంఖ్య 1169కి పెరిగింది. ఇందులో 41 శాతం అత్యాచార కేసులు కాగా, 15 శాతం లైంగిక వేధింపులున్నాయి. చిన్నా రులపై అత్యాచార కేసులు 2016లో కర్నాటకలో 1136, కేరళలో 957, తెలంగాణలో 690, ఆంధ్రప్రదేశ్లో 459 నమోదయ్యాయి.
అయితే తమిళనాడులో మాత్రం 1169 కేసులు నమోదయ్యాయి. విచిత్రమేమంటే ఇవన్నీ అధికారపూర్వకంగా నమోదైన కేసులే. కానీ కుటుంబం పరువు పోతుందనో, పెద్దల మధ్య వర్తిత్వంతోనో, భయపడో, రాజీ పడో పోలీస్స్టేషన్ల వరకూ రాకుండా వున్న కేసులు ఇంతకంటే ఎక్కువ వుంటాయని ఆ సర్వే నిర్వాహులు వ్యాఖ్యానించారు. కాగా 2016 తరువాత ప్రభుత్వంలో ఏర్పడిన కుదుపులతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్గా పరిగణించని పక్షంలో మునుముందు ఈ సంఖ్య కొన్ని రెట్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ప్రభుత్వ వర్గాలే చెప్పడం గమనార్హం.