శివాలయంపై తాజ్ మహల్ కట్టారా?
- తాజ్ మహల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరో బీజేపీ నేత
- తాజ్ మహల్ ఒక శివాలయమన్న బీజేపీ నేత కట్టర్
ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ పై బీజేపీ నేతలు తెరలేపిన వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. ఈ జాబితాలో మరో నేత చేరారు. శివాలయంపై తాజ్ మహల్ కట్టారని బీజేపీ సీరియర్ నేత వినయ్ కట్టర్ పేర్కొన్నారు.
పూర్వం అక్కడ తేజో మహల్ అనే శివాలయం ఉండేదని.. దానిని షాజహాన్ తాజ్ మహల్ గా మార్చారని ఆయన అన్నారు. అయితే.. తాను ఆ తాజ్ మహల్ ని కూల్చివేయాలని మాత్రం కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.
అది తేజో మహల్ అనే శివాలయమని.. తన భార్య చనిపోయాక షాజహాన్ దానిని సమాధి చేశారన్నారు. దీనిని హిందూ రాజులు కట్టించారని.. అందులోని గదులు చూస్తే అది హిందూ స్మారక కట్టడమనే విషయం అర్థమౌతుందని కట్టర్ అభిప్రాయపడ్డారు.
శివుని ఆలయం లాగానే.. తాజ్ మహల్ లోని సీలింగ్ వద్ద నుంచి నీరు పడుతుందని ఆయన అన్నారు. ఇది కచ్చితంగా సమాధి కాదని.. శివలింగమని కట్టర్ పేర్కొన్నారు.