సల్మాన్ కేసులో ఎన్ని ట్విస్టులో
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి బెయిల్ వస్తుందా..? రాదా? ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ఆయన బెయిల్ పిటీషన్ ముందుకు సాగడం లేదు. 20 ఏళ్ల క్రితం కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్ కి జోధ్ పూర్ న్యాయస్థానం ఐదేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. శనివారం పిటిషన్ విచారణకు రావాల్సి ఉండగా.. రాజస్థాన్ హైకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. జోధ్పూర్ జిల్లా మరియు సెషన్స్ జడ్జిని బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
సల్మాన్ బెయిల్ పిటిషన్పై వాదనలు వింటున్న సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 87 మంది జడ్జిలను ట్రాన్స్ఫర్ చేస్తూ హైకోర్టు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సల్మాన్ బెయిల్ పిటిషన్ వాయిదా పడినట్లేనని.. ఆయన మరిన్ని రోజులు జైల్లోనే గడపాల్సి ఉంటుందని న్యాయ నిపుణలు చెబుతున్నారు. నిజానికి సల్మాన్కు శిక్ష ప్రకటించిన రోజే (గురువారం) బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసుపై మరోసారి పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే ఆయనకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అన్నది నిర్ధారిస్థానని జడ్జి జోషి తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం సల్మాన్కు బెయిల్ వస్తుందని అంతా భావించారు. ఇప్పుడు న్యాయమూర్తి బదిలీతో సందిగ్ధత నెలకొంది. సినిమాలో కూడా లేనన్ని ట్విస్టులు వస్తున్నాయంటూ పలువురు ట్విట్టర్ లో కామెంట్లు పెట్టడం విశేషం.