ఈ దీపావళి వివాదాస్పదమేనా?
- బాణా సంచా అమ్మకాలపై నిషేధం
- వేలకోట్లు నష్టపోతామంటున్న వ్యాపారులు
- ప్రజల సంక్షేమమే ముఖ్యమంటున్న న్యాయస్థానాలు
దీపావళి అనగానే అందరికీ గుర్తు వచ్చేది బాణాసంచానే. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ మతాబులు కాలుస్తూ ఆనందంగా ఈ పండగ జరుపుకుంటారు. ఈ పండగ కారణంగా వ్యాపారులు కూడా బాగానే లాభపడతారు. ఎంతలా అంటే.. కేవలg హైదరాబాద్ నగరంలోనే వందల కోట్ల వ్యాపారం జరిగుతుంది. అందుకే వ్యాపారులు కూడా దీపావళి పండగ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. అయితే.. ఈ ఏడాది దిపావళి మాత్రం వివాదాస్పదంగా మారనుంది.
ఇప్పటికే బాణాసంచా కొనుగోళ్లు, అమ్మకాలు నిలిపేయాలని దిల్లీ, ముంబయి హైకోర్టులతోపాటు సుప్రీం కోర్టు కూడా తీర్పుఇచ్చింది. దీంతో దిల్లీలో చాలా మంది ఆన్ లైన్ లో అమ్మకాలు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం పై కూడా కోర్టు తీవ్రంగానే స్పందించింది. బాణాసంచా కొన్నా.. అమ్మినా ఊరుకోమంటూ హెచ్చరించింది. ఈ తీర్పుతో చాలా మంది నిరుత్సాహపడ్డారు. ప్రజల నిరుత్సాహం సంగతి పక్కన పెడితే.. వ్యాపారులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోర్టు తీర్పుతోతమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం కారణంగా ముఖ్యంగా చైనా దేశానికి, తమిళనాడులోని శివకాశీ బాణాసంచా కంపెనీలకు వేల కోట్లలో నష్టం జరుగుతుంది. అంతేకాకుండా కేవలం ఈ బాణాసంచా అమ్మకాలపైనే ఆశలు పెట్టుకున్న పలు చిన్న తరహా వ్యాపారులకు కూడా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కోర్టు నిర్ణయాన్ని యోగా గురు రామ్ దేవ్ బాబా కూడా విమర్శించడం గమనార్హం.
అయితే.. వ్యాపారుల లాభనష్టాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. కేవలం ప్రజల సంక్షేమం కోసమే తాము ఆలోచిస్తామని న్యాయస్థానాలు చెబుతున్నాయి.ఇదిలా ఉంటే ప్రతి సంవత్సరం కేవలం బాణాసంచా కారణంగానే తీవ్ర వాయుకాలుష్యం, శబ్ధకాలుష్యం వాటిల్లుతోంది. అంతేకాకుండా బాణా సంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదాల వల్ల దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం వందల మంది చనిపోతున్నారు. వీటన్నింటినీ నివారించేందుకే తాము ఈ న్యాయస్థానం తీసుకున్నట్లు న్యాయస్థానాలు గట్టిగా చెబుతున్నాయి.