కర్నూలు టిడిపి నేత సోమిశెట్టికి జగన్ మీద ఇంత కోపమెందుకో?
జగన్ కేంద్రానికి రాసిని రహస్య లేఖల వల్లే పోలవరం ప్రాజక్టులు అడ్డంకులు
పోలవరం ప్రాజక్టుకు కేంద్రం నుంచి వస్తున్న అడ్డంకుల మీద కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యాలు చేశారు. పోలవరం ప్రాజక్టుకు జగనే సైంధవుడిలా అడ్డుపడుతున్నాని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం వైసిపి నేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు లో ప్రజాసంకల్ప యాత్ర జరుగుపుతున్న సంగతి తెలిసిందే. పోలవరం టెండర్ ప్రాసెస్ ను నిలిపివేయాలని కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల మీద స్పందిస్తూ కేంద్రానికి జగన్ రహస్యంగా రాసిన లేఖల వల్లే పోలవరం ప్రాజెక్టు సమస్యలొస్తున్నాయని, జగనే పోలవరాన్ని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పోలవరాన్ని అడ్డుకుంటున్న జగన్ ను రాళ్లతో కొట్టాలని సోమిశెట్టి తెలుగుదేశం కార్యకర్తలకు, ప్రజలకు పిలుపు నిచ్చారు.
ముఖ్యమంత్రి కుర్చీ మీద యావతో ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నాడని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యేలను జగన్ పందికొక్కులు అనడం పట్ల సోమిశెట్టి అభ్యంతరం చెప్పారు, పందికొక్కులకు టికెట్లు ఇచ్చిన జగన్ ఏమవుతారు, ఇంకా పెద్ద పందికొక్కు అని ఆయన ఎద్దేవా చేశారు.
జగన్ కు బీసీలంటే గౌరవం లేదని... పాదయాత్రలో వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని, తాను ఈ యాత్రను పూర్తిగా గమనించే ఈ వ్యాఖ్య చేస్తున్నానని సోమిశెట్టి గుర్తు చేశారు. చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య గురించి పదేపదే మాట్లాడుతున్న జగన్, బీసీ కులానికి చెందిన సోమన్న అదృశ్యం కావడం కూడా ఎందుకు ప్రస్తావించడం లేదని లేదని ప్రశ్నించారు. జగన్ ఎప్పటికీ సీఎం కాలేరని అది ఆయన పగటి కల మాత్రమేనని అన్నారు.