ఏపి ఎమ్మెల్యే కార్యాలయంలో విష సర్పం
పట్టుకోడానికి ప్రయత్నించిన వ్యక్తికి కాటు
అది సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం. అదీ అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందింది. దీంతో అతడి కార్యాలయానికి నియోజకవర్గ ప్రజలు అనేక పనుల కోసం వస్తుంటారు. అయితే ఈ కార్యాలయంలో పనులు జరగడం మాట అటుంచి వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? అతడి కార్యాలయంలో అంత ప్రమాదకర ఘటన ఏం జరిగింందో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవండి.
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్య బోడె ప్రసాద్ కార్యాలయంలో విష సర్పాలు కలకలం సృష్టిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ కార్యాలయంలో తాచుపాము కలకలం రేపగా, ఆ తర్వాత ఓ జెర్రిపోతు పాము కార్యాలయంలోకి ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. తాజాగా నిన్న మద్యాహ్నం సమయంలో ఓ కట్ల పాము కార్యాలయం వద్ద ప్రత్యక్షమైంది. ఇలా పాములు ఎమ్మెల్యే కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ పనుల కోసం వచ్చిన సామాన్యులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ప్రవేశించిన కట్ల పామును పట్టుకోడానిక ప్రయత్నించిన అంకాలు అనే వ్యక్తి ని కాటేసింది. ఈ కాటుకు భయపడకుండా అతడు పామును పట్టుకుని చంపేశాడు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి పాము కాటుకు వైద్యం చేయించుకున్నాడు.
ఇలా తరచూ విష సర్పాలు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రత్యక్షమవుతుండడంతో వివిధ పనులపై కార్యాలయానికి వచ్చేవారితో పాటు, కార్యాలయ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు.