గుడ్ న్యూస్: వివరాలు నమోదు చేసి ఎంత కట్నమొస్తోందో తెలుసుకోండి
పెళ్ళికాని ప్రసాద్లకు గుడ్న్యూస్
భోపాల్: కట్నాలు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకొనేవారు చాలా
అరుదుగా కన్పిస్తుంటారు. అయితే ఓ వెబ్సైట్ లో వరుడికి
సంబంధించిన సమాచారాన్ని పొందుపరిస్తే ఎంత కట్నం
వస్తోందో అనే విషయాలను ఆ సైట్ వెల్లడిస్తోంది. దీనిపై
కాంగ్రెస్ పార్టీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా బుధవారం
నాడు ట్వీట్ చేశారు.
వివాహం చేసుకొనే సమయంలో వరుడి కుటుంబసభ్యులు
వధువు తరుపువారిని వరకట్నం కోసం డిమాండ్ చేయడం
చూస్తూనే ఉంటాం. వరకట్నం ఇవ్వలేదని తాళి
కట్టకుండానే పెళ్ళిళ్ళు కూడ నిలిచిపోయిన ఘటనలు
కూడ లేకపోలేదు.
అయితే పెళ్ళికి ముందే తమకు ఎంత కట్నం వస్తోందనే
విషయాన్ని తెలుసుకొనే వెసులుబాటు ఉంది. ఓ వెబ్ సైట్
ఎంత కట్నం వస్తోందనే విషయాన్ని అంచనా వేసి
చెబుతోంది.
డౌరీ క్యాలుకులెటర్ పేరుతో ఈ వెబ్సైట్ లో వరుడి పూర్తి
వివరాలను అందిస్తే ఎంత కట్నంగా వస్తోందో అనే
విషయాలను స్పష్టంగా తెలుసుకొనే వీలుంటుంది.
ఈ సైట్లోకి వెళ్ళి వయసు, కులం, వృత్తి, వేతనం, ఎక్కడ
పనిచేస్తున్నారు. తండ్రి వృత్తి వివరాలతో పాటు,
కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేయాలి. అంతేకాదు
వరుడి చర్మం రంగును కూడ అడుగుతోంది.
వరుడు నమోదు చేసిన సమాచారం ఆధారంగా దీనికి
సంబంధించి ఎంత కట్నం తీసుకోవచ్చనే విషయమై ఆ
సైట్ వివరాలు వెల్లడించనుంది.
ఈ సైట్ కు సంబంధించిన సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ
ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ చేశారు. ఈ సైట్ కు
సంబంధించిన సమాచారాన్ని తనకు ఓ మిత్రుడు
చేరవేశాడని ఆయన చెప్పారు.
వరకట్నం తీసుకోవడం నేరమని జ్యోతిరాదిత్య సింధియా
గుర్తు చేశారు. ఈ సైట్పై చర్యలు తీసుకోవాలని సింధియా
కేంద్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖకు, ప్రధానమంత్రికి లేఖ
రాసినట్టు చెప్పారు.