తమిళనాడు ప్రమాదంలో తెలంగాణ ఎస్సై మృతి
- తమిళనాడులో రోడ్డు ప్రమాదం
- తెలంగాణ షామీర్ పేట ఎస్సై మృతి
తమిళనాడు లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలంగాణ కు చెందిన ఓ ఎస్సై మృతిచెందాడు. దైవదర్శనం కోసం శబరిమలకు వెళ్లి వస్తూ కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ఎస్సైతో పాటు ఇంకో ముగ్గురు వ్యక్తులు కూడా చనిపోయారు.
ప్రమాదానికి సంభందించిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన రఘు మేడ్చల్ జిల్లా షామీర్ పేటలో ఎస్సైగా పనిచేస్తున్నాడు. అయితే సెలవులపై స్వగ్రామానికి వెళ్లిన రఘు తన తమ్ముడు రాంప్రసాద్, స్నేహితులు మధుసూదన్రెడ్డి, తాటిచర్ల సుబ్బరాయుడు, మహేష్ లతో కలిసి కారులో శబరిమలకు బయలుదేరారు. అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో తిరుమంగళం వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ని డీ కొట్టి పక్కనే వున్న లోయలోకి పడిపోయింది. సుమారు 50 ఫీట్ల లోతు గల లోయలోకి కారు పడటంతో ఎస్ఐ రఘుతో పాటు రాంప్రసాద్, మధుసూదన్రెడ్డి, మహేశ్ లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో స్నేహితుడు సుబ్బరాయుడుకు తీవ్ర గాయాలతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ రఘు మృతి చెందిన విషయం తెలిసి షామీర్ పేటలోని ప్రజలు, ప్రజా ప్రతినిదులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఆయన స్వస్థలంలో ఒకేసారి చేతికి అందివచ్చిన ఇద్దరు పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.