ఐపీఎల్... ప్రాక్టీస్ సెషన్ లో షమీ
టీం ఇండియా క్రికెటర్, పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు ఐపీఎల్ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రాక్టీస్ సెషన్ కి హాజరయ్యాడు. గత కొద్ది రోజుల క్రితం.. షమీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. డెహ్రాడూన్ లో శిక్షణ కోసం వెళ్లి ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం కోలుకున్న షమీ సోమవారం ఢిల్లీ జట్టు శిక్షణా శిబిరంలో పాల్గాన్నాడు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో వార్మప్ మ్యాచ్కు ముందు ఫిట్నెస్ డ్రిల్స్తో పాటు క్యాచింగ్ ప్రాక్టీస్ చేశాడు.
గాయం పూర్తిగా నయం కాకపోవడంతో తలకు ఇంకా బ్యాండ్-ఎయిడ్ ధరించి మైదానంలోకి వచ్చేశాడు. ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ పర్యవేక్షణలో ఆ జట్టు ఆటగాళ్లు సాధన చేస్తున్నారు. షమీ భార్య హాసిన్ జహాన్ ఫిక్సింగ్ ఆరోపణలు చేయడంతో విచారణ జరిపిన బీసీసీఐ అతనికి క్లీన్చిట్ ఇవ్వడంతో ఐపీఎల్లో ఆడేందుకు మార్గం సుగమమైంది.
షమీతో పాటు అతని కుటుంబసభ్యులు తనను మానసికంగా, శారీరకంగా హింసించారని కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు కూడా నమోదైన సంగతి విదితమే.