రేపు సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ప బలపరీక్ష: సుప్రీం
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రేపు (శనివారం) సాయంత్రం 4 గంటలకు బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రేపు (శనివారం) సాయంత్రం 4 గంటలకు బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బిజెపి అడిగిన గడువుకు సుప్రీంకో ర్టు అంగీకరించలేదు. బలపరీక్షకు సమయం కావాలని బిజెపి అడిగింది. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు.
అంతకు ముందు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఎవరికి మెజారిటీ ఉందన్నది నిర్ణయించేది గవర్నరేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడినప్పటికీ యడ్యూరప్పకు రెండు ప్రత్యామ్నాయాలను సూచించింది.
ఒకటి యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని పరీక్షించడం కాగా రెండోది 24 గంటల్లో బలనిరూపణ చేసుకోవడం. బలనిరూపణ శాసనసభలోనే జరగాలని కూడా సూచించింది. తుది తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది.
మెజారిటీ ఉందంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజెపికి బలం ఉందా లేదా అనేదానికి సాక్ష్యం ఉందా, లేదా అనేది ముఖ్యమని కాంగ్రెసు, జెడిఎస్ తరఫున వాదించి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. అవకాశం ఇస్తే తాను మెజారిటీని నిరూపించుకుంటాననే దానిపైనే ఆధారపడ్డారని అన్నారు.
ఓవైపు కాంగ్రెసు, జెడిఎస్ తమకు మెజారిటీ ఉందని లేఖ ఇచ్చి తర్వాత తనకు మెజారిటీ ఉందని యడ్యూరప్ప చెప్పారని, ఈ స్థితిలో దేనిపై ఆధారపిడ గవర్నర్ కూటమిని కాకుండా యడ్యూరప్పకు అవకాశం ఇచ్చారని జస్టిస్ సిక్రి అన్నారు.