ఈ గ్రీటింగ్స్.. ‘ ఆడపిల్లల’ ప్రత్యేకం
- ఆడపిల్లల రక్షణకు వినూత్న ప్రయత్నం
- ఆడపిల్లలను కన్న తల్లులకు గ్రీటింగ్ కార్డుల పంపిణీ
- గ్రీటింగ్ కార్డులో తల్లీ-బిడ్డ ఫోటోలు
ఆడపిల్లలను రక్షించడానికి ఛతీస్ గఢ్ లో వినూత్న ప్రచారం చేపట్టారు. ఆడపిల్ల పుడితే వారిని పురిట్లోనే చంపేవాళ్లు.. లేదా ఇంకేదైనా విధానంలో వదిలించుకునే వాళ్లు మన సమాజంలో ఇంకా చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో అవగాహన కలిగించేందుకు రాయగడ్ జిల్లాలో వినూత్న కార్యక్రమం చేపట్టారు.
అక్కడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎవరైనా ఆడపిల్లలకు జన్మనిస్తే..వారికి ప్రోత్సాహకరంగా ఒక గ్రీటింగ్ కార్డును అందజేస్తున్నారు. దాని మీద ‘సేవ్ అండ్ ఎడ్యుకేట్ గర్ల్ చైల్డ్’ అని రాసి ఉంటుంది. ఆడపిల్లలను కన్న తల్లులకు ప్రత్యేకంగా తయారు చేసిన ఈ గ్రీటింగ్ కార్డులను వారు అందజేస్తున్నారు.
అంతేకాదు.. ఆ గ్రీటింగ్ కార్డులో తల్లి... అప్పుడే పుట్టిన చిన్నారి ఫోటోలను తీసి మరీ అందులో పెట్టి వారికి అందజేస్తున్నారు. అంతేకాదు.. తల్లి- బిడ్డ పేర్లను..వారి ఫోటోలను హాస్పిటల్ నోటీస్ బోర్డులో కూడా పెడుతున్నారు. ‘ బేటీ బచావ్- బేటీ పడావ్’ పథకంలో భాగంగా తాము ఈ కార్యక్రమం చేపట్టామని ఆ జిల్లా కలెక్టర్ షమి అబిది తెలిపారు. ఇలా చేయడం వల్ల ఆడపిల్లలను ప్రోత్సహించినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. అందమైన గ్రీటింగ్ కార్డులను తయారు చేసి వారికి అందజేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఛతీస్ గఢ్ లోని అన్ని జిల్లాల్లో కెల్లా ఆడపిల్లల శాతం తక్కువగా ఉన్న జిల్లా రాయ్ గడ్. అందుకే ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. ఈ విధానం చేపట్టిన నాటి నుంచి జిల్లాలో చైల్డ్ సెక్స్ రేషియో( సీఎస్ ఆర్)లో మార్పు కనపడుతోందని అధికారులు చెబుతున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం.. ఈ జిల్లాలో వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 947మంది అమ్మాయిలు ఉన్నారని, 2014-15 నాటికి అమ్మాయిలు మరింత తగ్గిపోయారని అధికారులు తెలిపారు. 2014లో వెయ్యి మంది అబ్బాయిలకు 918మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. దీంతో ఆడపిల్లలను రక్షించేందుకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు చేపట్టగా.. కొద్దిగా మార్పు కనపడుతోందన్నారు. 2016-17 లెక్కల ప్రకారం వెయ్యి మంది అబ్బాయిలకు 936మంది అమ్మాయిలు ఉన్నారని అధికారులు తెలిపారు.