వేలానికి యాంబీ వ్యాలీ.. ప్రారంభ ధర రూ.37 వేలకోట్లు!
- వ్యాలీని బాంబే హైకోర్టు సోమవారం వేలానికి పెట్టింది.
- వ్యాలీకి ప్రారంభ ధర రూ. 37,392కోట్లుగా న్యాయస్థానం నిర్ణయించింది
సహారా గ్రూప్కు చెందిన లగ్జరీ యాంబీ వ్యాలీ గురించి వినే ఉంటారు. చూడటానికి రెండు కళ్లు సరిపోవా.. అన్నంత అందంగా ఉంటుంది. ఇప్పడు ఆ వ్యాలీని బాంబే హైకోర్టు సోమవారం వేలానికి పెట్టింది. వార్తాపత్రికల ద్వారా నోటీసులు ఇచ్చి బిడ్డర్లను ఆహ్వానించింది.
పూణె లోని లోనావాలా ప్రాంతంలో గల ఈ ఖరీదైన వ్యాలీకి ప్రారంభ ధర రూ. 37,392కోట్లుగా న్యాయస్థానం నిర్ణయించింది. ఈ వ్యాలీ 6,761 ఏకరాల్లో ఉంది. సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ఉన్న ఈ వ్యాలీలో గోల్ఫ్ కోర్స్, ఎయిర్పోర్టు, హాస్పిటల్, అడ్వెంచర్ స్పోర్ట్స్, రీటేల్, ఎంటర్టైన్మెంట్, ఇంటర్నేషనల్ స్కూల్ వంటి అధునాతన సదుపాయాలున్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇన్వెస్టర్లకు డబ్బులు ఎగవేసిన కేసులో సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. యాంబీ వ్యాలీని వేలం వేయాలంటూ గతేడాది తీర్పు చెప్పింది. అయితే తాము డబ్బులు తిరిగిచ్చేస్తామని వేలాన్ని నిలిపివేయాలని సహారా గ్రూప్ పలుమార్లు కోర్టును ఆశ్రయించింది. ఇప్పటివరకూ కూడా డబ్బులు చెల్లించకపోవడంతో.. వ్యాలీని వేలం వేయాల్సిందేనని సుప్రీంకోర్టు గత గురువారం స్పష్టం చేసింది. దీంతో నేటి నుంచి వేలం ప్రక్రియను ప్రారంభించారు.