మరోసారి సోషల్ మీడియాలో ఎమోషనల్ అయిన రేణుదేశాయ్
నటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్.. మరోసారి సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు. రేణుదేశాయ్.. తన మాజీ భర్త పవన్ గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఎమోషనల్ కూడా అవుతుంటారు.తాజాగా మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. పవన్, రేణుల ముద్దుల కుమారుడు అకీరా నందన్ ఆదివారం( ఏప్రిల్ 8) 14వ ఏట అడుగుపెట్టాడు. దీంతో.. పవన్ అభిమానుల నుంచి.. అకీరాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రేణు భావోద్వేగంతో ట్వీట్ చేశారు. ‘మీరంతా నా బాబుపై చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అతడు 14 సంవత్సరాల్లోకి అడుగుపెట్టాడు.. కాబట్టి అతడు ఇప్పుడు చిన్నవాడు కాదు. కానీ జన్మనిచ్చిన తల్లికి తన బిడ్డ ఎప్పటికీ చిన్నవాడిలాగే కనిపిస్తాడు. గొప్ప వ్యక్తులు ఉన్న కుటుంబంలో అకీరా జన్మించాడు. తన కుటుంబసభ్యులులాగా అతడు కూడా ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో విజయవంతంగా రాణించాలని, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని తల్లిగా కోరుకుంటున్నా’.
‘మీరంతా ఇవాళ తల్లిగా నన్ను భావోద్వేగానికి గురి చేశారు. రాత్రి నుంచి మీరు చెబుతున్న అందమైన పుట్టినరోజు శుభాకాంక్షలకు నా నుంచి కేవలం ధన్యవాదాలు సరిపోవు. నా చిట్టి బర్త్డే బాయ్ నుంచి మీకు కృతజ్ఞతలు’ అని రేణు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతోపాటు అకీరాతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ఇదే సందర్భంగా రామ్ చరణ్, వరుణ్తేజ్, సాయిధరమ్ తేజ్ కూడా అకీరాకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.