ఎయిర్ టెల్ పై మండిపడుతున్న జియో
ఎయిర్ టెల్ పై జియో ఫిర్యాదు
ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, జియోల మధ్య వైరం రోజు రోజుకీ ముదురుతోంది. జియో.. టెలికాం రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సంచలనాలకు తెరలేపింది. దీంతో.. జియో పోటీని తట్టుకునేందుకు ఎయిర్ టెల్ నానా అవస్థలు పడుతోంది. జియోకి పోటీకి పలు రకాల ఆఫర్లను, ప్లాన్ లను ప్రవేశపెట్టింది.
ఇదిలా ఉండగా.. ఎయిర్ టెల్ పై రిలయన్స్ జియో తీవ్రస్థాయిలో మండిపడుతోంది. రిలయెన్స్ జియో యాజమాన్యం భారతీ ఎయిర్టెల్ కంపెనీపై టెలికమ్యూనికేషన్స్ శాఖకు ఫిర్యాదు చేసింది. ఎయిర్టెల్ చేస్తున్న పనులు చట్టవ్యతిరేకంగా ఉన్నాయని... అందుకే ఆ కంపెనీపై తగు చర్యలు తీసుకొని భారీగా పెనాల్టీలు విధించాలని కోరింది.
ఎయిర్ టెల్ వాడే నెట్వర్క్ నోడ్స్ భారతదేశానికి వెలుపల ఉన్నాయని.. యాపిల్ వాచ్ సర్వీసులు అందివ్వడం కోసమే ఆ కంపెనీ ఈ మార్గాన్ని అనుసరిస్తోందని జియో తెలిపింది. ఈ విధంగా చేయడమంటే సెక్యూరిటీ నిబంధనల్లో తుంగలో తొక్కడమేనని జియో ఆరోపించింది. అయితే జియో చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఎయిర్టెల్ చెబుతోంది. ఈ రెండు కంపెనీలు కూడా యాపిల్ వాచ్ 3 సిరీస్లను మే 11, 2018 తేది నుండీ అమ్ముతున్నాయి. అయితే ఎయిర్ టెల్ పద్ధతులు జాతీయ భద్రతకు భంగం కలిగించేవిధంగా ఉన్నాయని జియో ఫిర్యాదులో పేర్కొంది.