అరికాళ్ల మంటలకు ... డాక్టర్ చేపను కలవండి
ఈ తటాకం నీళ్లలో కాల్లు మునిగేలా కూర్చుంటే అరి కాళ్ల మంటలు మాయమవుతున్నాయి. కాళ్ల పగుళ్లు నయమవుతున్నాయి.
జార్ఖండ్ రాజధాని రాంఛిలో కొత్త గా కట్టిన ఆక్సిజన్ పార్క్ సూపర్ హిట్.
నగరంలోని మోరాబాది ఏరియాలో నాలుగు కోట్లతో పెంచిన ఈ పచ్చసామ్రాజ్యాన్ని ముఖ్యమంత్రి రఘబర్ దాస్ ఈ మార్చి 29న ప్రారంభించారు.
ఇంకా నెల రోజులు కాలేదు, అపుడే జనం తండోపతండాలుగా ఆక్సిజన్ పార్క్ తోసుకుంటూవస్తున్నారు.
కారణం తెలుసా...
అక్కడ చల్లగా ఉంటుందని కాదు, అక్కడ దండిగా ఆక్సిజన్ ను పీల్చుకోవచ్చని కాదు. పార్క్ లో ఉన్న రెండు తటాకాలలో ప్రజలు ఒక వింత కనిపెట్టేశారు. పార్కంతా వాకింగ్ పేరుతో కలియతిరిగి అలసి పోయి సేదతీర్చుకునేందుకు వారెవరూ అక్కడి సిమెంట్ మీద నడుం వాల్చడమో, పచ్చిక మీద వాలిపోవడమో చేయడం లేదు.
పార్క్ లో ఉన్న రెండుతటాకాలలో కాళ్లు ముంచి కూర్చుంటున్నారు. అలా కొద్దిసేపు కూర్చుంటున్నారో లేదో, వాళ్ల అలసట తగ్గుతూ ఉంది. కాళ్ల నొప్పులు మాయమవుతున్నాయి. కాళ్ల పగుల్లునయమవుతున్నట్లు కూడా వారు కనిపెట్టారు. ఈ వార్త అలా రాజధాని మొత్తం పాకింది. అంతే, ఇది పరిస్థితి (పోటో).
దీనితో ఏ సమయంలో వెళ్లినా కనీసం అరవై డెబ్బయిమంది ఇలా కొలను చికిత్స తీసుకుంటూ ఉండటం చూడవచ్చు.
ఎందుకిలా జరుగుతూ ఉంది?
ఈ రెండు తటాకాలలో ఒకదాని వైశాల్యం 375 చదరపు మీటర్లుంటుంది.
రెండోది 150 చ.మీ వైశాల్యంలో కట్టారు. వీటిని స్పాపాండ్స్ గా అటవీ శాఖ తయారుచేసింది. ఈ రెండు తటాకాల్లోకి అటవీశాఖ డాక్టర్ చేప (Garra rufa)లను వదలిపెట్టింది. ఇవి చాలా చిన్నచేపలు. వాటికి పళ్లుండవు. కాబట్టి కొరకలేవు. అయితే కాళ్లకు పగుళ్లొచ్చినపుడు బయటపడే మృత చర్మాన్ని ఇవి తినేస్తాయి. దీనితో కొత్త చర్మం పెరిగేందుకువీలవుతుంది.
ఈ డాక్టర్ చేపలను వైద్యానికి వాడటం ప్రపంచంలో చాలా చోట్ల ఉంది. అమెరికా లోని అనేక రాష్ట్రాలలో నిషేధించడం కూడా ఉంది. అది వేరే విషయం. గ్యారా రూఫా అనే ఈ చేప పశ్చిమాసియా దేశాలలో పెరుగుతుంది.
అటవీ శాఖ అధికారులు వీటిని మోరాబాది తాటాకాల్లో వదిలారు. ఆ చేపల వల్లే తమకు ఉపశమనం కలుగుతూ ఉందని చాలా మందిచెబుతున్నారు. ‘ఒక గంటసేపు నేను పార్కంతా నడుస్తాను. అలసట వస్తుంది. అపుడు ఈ తటాకం నీళ్లలో కాల్లుమునిగేలా కూర్చుంటాను.నాకాళ్ల మంటలు మాయమవుతున్నాయి. అదేదో వింత అనిపిస్తుంది.’రోజూ ఈ పార్క్ కు వచ్చే కిరణ్ సిన్హా చెప్పారు.
పదిహేను నిమిషాలు ఇలా నీళ్లలో కాళ్లు చాపి కూచున్నానో లేదో ఈ పిష్ మసాజ్ తో నా కాళ్ల నొప్పులు పోతున్నాయని పార్క్ కు వచ్చిన చాలా మంది చెబుతున్నారు. ఇలా అయితే, కొద్దిరోజుల్లోనే ఇక్క నీళ్లలో కాలు చాపి కూర్చునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కడతారని అటవీశాఖ అధికారులంటున్నారు.