రైల్వే టికెట్లపై డిస్కౌంట్లు
- ప్రయాణికులకు శుభవార్త
రైలు ప్రయాణికులకు నిజంగా ఇది శుభవార్తే. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు రైల్వే శాఖ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. రైలు టికెట్లపై డిస్కౌంట్లు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాలనుకుంటోంది. ఈ విషయాన్ని ఆశాఖ మంత్రి పీయూష్ గోయల్ అధికారికంగా తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోజరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన
‘ఎయిర్లైన్స్ తరహాలో రైల్వే టికెట్లపై రాయితీ ఇచ్చే అంశంపై అధ్యయనం చేస్తున్నాం’ అని తెలిపారు. ఫ్లెక్సీ ఫేర్ విధానంలో ధరలు ఎక్కువగానే ఎందుకు ఉండాలి అని ప్రశ్నించారు.
‘చివరి నిమిషంలో బుక్ చేసుకున్నప్పటికీ విమానాలు, హోటళ్లలో డిస్కౌంట్ అందిస్తున్నారు. తక్కువ ఆక్యుపెన్సీ కలిగిన మార్గాల్లో డిస్కౌంట్లు అందిస్తాం’ అని గోయల్ చెప్పారు. ప్రస్తుతం రైల్వే బోర్డు ఛైర్మన్గా ఉన్న అశ్వనీ లోహానీ కూడా విమానయాన సంస్థ ఎయిరిండియా నుంచి వచ్చిన వారేనని, దీనిపై ఆయన కూడా అధ్యయనం చేస్తున్నారని మంత్రి వివరించారు.
2018లో ప్రయాణికుల భద్రతపైనే ప్రముఖంగా దృష్టి సారించనున్నట్లు గోయల్ తెలిపారు. ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు రైళ్లలో సీసీటీవీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీసీటీవీలను అనుసంధానం చేసేందుకు అన్ని రైల్వేస్టేషన్లలోనూ వైఫై సదుపాయాన్ని కల్పించనున్నామని తెలిపారు. రైల్వేల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి రైళ్లను కేవలం అరగంటలో శుభ్రపరిచి తదుపరి ప్రయాణానికి సిద్ధం చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రైల్వేల్లో సమయపాలన, భద్రత తదితర అంశాలపై చర్చించారు