యడ్యూరప్ప రాజీనామా: మోడీని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ
ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యడ్యూరప్ప రాజీనామా చేసిన తర్వాత ఎఐసిసి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎఐసిసి కార్యాలయం వద్ద కాంగ్రెసు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి స్వయంగా ప్రధాని మోడీ పచ్చజెండా ఊపడం దారుణమని ఆయన అన్నారు మీరు ఏ చట్టానికీ అతీతులు కారని ప్రజలు మోడీకి చెప్పారని ఆయన అన్నారు. గోవా, మణిపూర్లోనూ ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులు ఎరచూపారని, కర్ణాటకలో ఈ ప్రయత్నాలు బెడిసికొట్టాయని ఆయన అన్నారు.
ఇది ప్రజాస్వామ్య విజయమని ఆయన అన్నారు. కర్ణాటక ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, దేవెగౌడకు, జెడిఎస్ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ ఎన్నో ప్రలోభాలకు పాల్పడినట్టు ఫోన్ సంభాషణలు, టేపులు చెబుతున్నాయని, దీన్ని బట్టే దేశంలో అవినీతిని నిర్మూలిస్తామని మోడీ చెప్పే మాటలు పచ్చి అబద్దాలని మరోసారి రుజువైందని ఆయన అన్నారు.
కర్ణాటకలో తాజా పరిణామం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు ఒక గుణపాఠమని, ప్రజల అభీష్టం కూడా తాజా ఫలితంతో రుజువైదంని అన్నారు. ప్రధాని మోడీ, అమిత్షా దేశంలోని అన్ని వ్యవస్థలను కుప్పకూలుస్తున్నారని, ఇందుకు అన్నిరకాల విధానాలను అనుసరిస్తారనే విషయం మరోసారి దేశప్రజలకు తెలిసిపోయిందని అన్నారు.