ముద్రగడ చుట్టు బిగుస్తున్న నిర్బంధం
- ముద్రగడ జూలై 26 యాత్ర జరగకుండా తీవ్రమయిన నిర్బంధం
- యాత్ర చట్ట విరుద్ధం అంటున్న పోలీసులు
- యాత్రలో ఎవరు పాల్గొన్నా చర్యలు
- ప్రతిపక్షాలకు పోలీసులు హెచ్చరిక
కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జూలై 26 నుంచి చేపట్టనున్న పాదయాత్ర ఏ విధంగా జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు మొదలుపెట్టింది. పద్మనాభం యాత్ర జరిగినా, అరెస్టులతో ఆగిపోయినా పెద్ద సంచలనం అవుతుంది. అందువల్ల ఇది పతాకా శీర్షికలకు ఎక్కకుండా చూడటం ఎలా అనేది ప్రభుత్వ యోచన. ఈ యాత్రకు ఒక అంగుళం కదలకుండా నిషేధాజ్ఞలు విధించారు. ప్రతిపక్ష నాయకుల మీద నిర్బంధం విధిస్తున్నారు. వారికి పోలీసులు 149 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో సెక్షన్ 30, సెక్షన్ 144 అమల్లో ఉన్నాయనే పేరు మీద సమావేశాలు, సభలు, పాదయాత్రలు నిర్వహించకూడదని పోలీసులు ప్రకటించారు.
వైసిపి, సిపిఎం, సిపిఐ నేతలకు నోటీసులు జారీ చేశారు. సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి బుధవారం నాడే నోటీసులు అందుకున్నారు.శుక్రవారం నాడుపోలీసులు వైసిపి రాజమహేంద్రవరం రూరల్ కో-ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు వెళ్లారు. అయితే ఆయన హైదరాబాద్లో ఉండటంతో నోటీసు అందించలేకపోయారు. రాజమహేంద్రవరంలోని సిపిఎం కార్యాలయానికి వెళ్లి పార్టీ జిల్లా కార్యదర్శి టి.అరుణ్కు నోటీసులు ఇచ్చారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని, ఇతరులు పాదయాత్రలో పాల్గొనడం చట్టవిరుద్ధమని , మీ పార్టీ కూడా పాల్గొనగడానికి వీల్లేదని పోలీసులు తెలిపారు.
అనుమతులు లేని పాదయాత్రల్లో పాల్గొంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించారు. ప్రకాష్నగర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పేరుతో ఈ నోటీసులు అందించారు. సిపిఐ కార్యాలయానికి వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. తాము వేరే సమావేశంలో ఉన్నామని, తర్వాత రావాలని చెప్పడంతో పోలీసులు వెళ్లిపోయారు. ఉద్యమాలను అణచివేసేందుకు పోలీసులు ఇలా ప్రయత్నించడం అప్రజాస్వామిక మని సిపిఐ నాయకుడు మీసాల సత్యనారాయణ విమర్శించారు. రాజమహేంద్రవరంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా వైసిపి, సిపిఐ, సిపిఎం నాయకులకు నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు .
ముద్రగడ పాదయాత్రకు మద్దతు తెలిపిన నేతలందరికి నోటీసులు ఇస్తున్నామని రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పి బి.రాజకుమారి చెప్పారు.