కర్ణాటకలో బీజేపీ విజయ రహస్యం ఇదే..
మోదీ, అమిత్ షా వేసిన ప్లాన్ ఇదే
ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. అనుకున్నది సాధించేశారు. కర్ణాటకలో అధికార పీఠం దక్కించుకోవాలన్న వారి కళను నెరవేర్చుకున్నారు. ఈ విజయం వెనుక మోదీ, అమిత్ షా పెద్ద ప్లానే వేశారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్నారు.. సాధించారు. గత ఐదేళ్లుగా ఎన్నికల్లో మోదీ-షా అనుసరిస్తున్న వ్యూహమే కర్ణాటక ఉత్కంఠ పోరులో ఆ పార్టీ విజయానికి ఉపకరించింది.
రెండంచెల వ్యూహంలో భాగంగా తొలి దశలో ఎన్నికలకు ఏడాది ముందుగా దీర్ఘకాల సన్నాహాలు చేపట్టడం, క్షేత్రస్ధాయిలో కార్యకర్తలను, పార్టీ శ్రేణులను ఎన్నికలకు కార్యోన్ముఖులను చేయడం చేపట్టారు. బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచే సామాజిక వర్గాలను అక్కున చేర్చుకోవడంతో పాటు విపక్ష ఓటు బ్యాంకులను భగ్నం చేసేందుకు వ్యూహాలు రచించేందుకు ఈ దశలో పదునుపెట్టడం బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంలో భాగం.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్లను ఏకతాటిపైకి నడిపించడంలో బీజేపీ వ్యూహాత్మకంగా బీఎస్ యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా అగ్రభాగాన నిలిపింది. అదేతరహాలో కాంగ్రెస్కు అండగా నిలిచే దళితులను ఆకట్టుకునేందుకు దళిత నేత శ్రీరాములుకు ప్రాధాన్యత కల్పించడం, పరివర్తన యాత్రలో భాగంగా దళితుల ఇళ్లలో యడ్యూరప్ప విందు ఆరగించడం వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అధికారంలో చురుకుగా పాలుపంచుకుంటున్న ప్రాబల్యవర్గాల పట్ల అసంతృప్తితో ఉన్న అత్యంత వెనుకబడిన కులాలను ఆకట్టుకోవడం కూడా మోదీ-షా వ్యూహంలో భాగమే.
ఇక రెండో దశ బీజేపీ ప్రచారం గత ఎన్నికల తరహాలోనే మోదీ ఉద్వేగపూరిత ప్రసంగాలు, భారీ ర్యాలీలు, రోడ్ షోలతో హోరెత్తించడం ద్వారా ప్రచార పర్వంలో పైచేయి సాధించడం. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ సీప్లేన్ను ఉపయోగించడం ఈ తరహా ప్రచారార్భాటాలకు పరాకాష్టగా చెబుతారు. అదే ప్లాన్ ని ఇక్కడ కూడా ప్రయోగించి విజయం సాధించారు.