తాజ్ లో కలకలం: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కాల్, పోన్లు స్విచ్ఛాప్
కర్ణాటక శాసనసభ్యులు మకాం వేసిన హైదరాబాదులోని తాజ్ కృష్ణాలో ఒక్కసారిగా కలకలం రేగింది.
హైదరాబాద్: కర్ణాటక శాసనసభ్యులు మకాం వేసిన హైదరాబాదులోని తాజ్ కృష్ణాలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ అజ్ఞాతవ్యక్తి ఓ కాంగ్రెసు ఎమ్మెల్యేకు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. తాను సెల్లార్ లో ఉన్నానని, రావాలని అతను ఫోన్ లో చెప్పాడు.
దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఫోన్ చేసిన వ్యక్తిని బళ్లారి వ్యాపారవేత్తగా కాంగ్రెసు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అతని కోసం వెతకడం ప్రారంభించారు
కాంగ్రెసు శానససభా పక్ష సమావేశం శుక్రవారం సాయంత్రం తాజ్ కృష్ణాలో జరిగింది. ఈ సమావేశంలో సిద్ధరామయ్యతో పాటు జెడిఎస్ నేత కుమారస్వామి కూడా పాల్గొన్నారు.
కాంగ్రెసు, జెడిఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం రాత్రి బెంగళూరుకు బయలునదేరే అవకాశం ఉంది. శనివారం 11 గంటలకే శాసనసభకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో వారు ఈ రాత్రే బయలుదేరుతారని అంటున్నారు.
వారు ఎలా వెళ్తారు, ఏ మార్గంలో వెళ్తారు అనే విషయాలను గోప్యంగా ఉంచారు. కాంగ్రెసు, జెడిఎస్ శాసనసభ్యులు శుక్రవారం ఉదయమే బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. యడ్యూరప్ప బలనిరూపణకు గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడంతో బిజెపి బేరసారాలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు.
అయితే, సుప్రీంకోర్టు తీర్పుతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. శనివారం సాయంత్రం బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో వారంతా హైదరాబాదు నుంచి రేపు శనివారం ఉదయానికల్లా బెంగళూరులో ఉండాల్సి వస్తోంది.