2019 లో నేనే సీఎం : పవన్ కల్యాణ్
2019 లో నేనే సీఎం : పవన్ కల్యాణ్
ప్రజల ఆశిస్సులు, జనసేన కార్యకర్తల పనితనంతో 2019 ఎన్నికల్లో తాను సీఎం కానున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. తనకు గుండెల నిండా ఆత్మ విశ్వాసం, దేనికైనా తెగించే తెగింపు ఉందని అందువల్లే ఎవరికీ భయపడనని తెలిపారు. రానున్న కాలంలో జనసేన ప్రభుత్వం ఏర్పడి వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి పాల్పడుతుందని హామీ ఇచ్చారు. ఇవాళ శ్రీకీకుళం జిల్లా పలాసలో పర్యటించిన పవన్ కల్యాణ తెలుగుదేశం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చని ఈ ప్రభుత్వాన్ని, నాయకులను చొక్కాలు పట్టుకుని నిలదీస్తామని పవన్ హెచ్చరించారు. ఈ ప్రభుత్వం మాట నిలబెట్టుకోకుంటే తాను పోరాడతానని 2014 లో చెప్పానని, అందువల్లే ఇపుడు ప్రజల తరపున మాట్లాడుతున్నానని జనసేనాని స్పష్టం చేశారు. ప్రజల కోసం ఈ ప్రభుత్వాన్నే కాదు ఎవరినైనా ఎదిరిస్తానని పవన్ హెచ్చరించారు.
ఇక ప్రత్యేక హోదా కోసం జరిగిన ఆత్మహత్యల గురించి పవన్ ప్రస్తావించారు. పలాసలో 19 ఏళ్ల యువకుడి ప్రాణాలు బలితీసుకున్న ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. ఆ తల్లి కడుపు కోత తెలుగుదేశం ప్రభుత్వానికి వెంటాడుతుందని విమర్శించారు.
ఇక ప్రత్యేక హోదా విషయంలో కేంద్రన్ని మొదటిసారిగా ప్రశ్నించిన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీనే అని పవన్ గుర్తు చేశారు. అలాంటి పార్టీ బిజెపి ప్రభుత్వం తో కుమ్మక్కయిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయని పవన్ తెలిపారు.
2014 లో తెలుగుదేశం సపోర్ట్ చేసినప్పటికి ప్రజల అభీష్టం మేరకు ఆ పార్టీని వీడి బైటికి వచ్చినట్లు పవన్ తెలిపారు. ఇక ప్రతిపక్ష వైసిపి లాగా కుసంస్కారంగా మాట్లాడటం నతనకు చేతకాదని, అంబేద్కర్ బాటలో సంస్కారంగా మాట్లాడతానని తెలిపారు.
ఇక లోకల్ గా పలాస రాజకీయాల గురించి కూడా పవన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. పలాస ప్రజలు కేవలం జీఎస్టీ ట్యాక్సే కాకుండా అల్లుడి గారి ట్యాక్స్ ను కూడా కడుతున్నారని ఆరోపించారు. ఈ కొత్త ట్యాక్స్ ను కట్టడం పలాస ప్రజలు మానుకోవాలని సూచించారు.
ఇక చివరగా అగ్రి గోల్డ్ గురించి మాట్లాడిన పవన్, బాధితుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దిగా వ్యవహరించాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చేయడంలో తాను పాటుపడతానని పవన్ స్పష్టం చేశారు.