బ్రాందీ షాపులు మూత : ’అమ్మ‘ బాట పట్టిన పళనిస్వామి
మహిళల సంక్షేమం కోసం తొలిసంతకాలు చేసి ‘అమ్మ’ బాట పట్టిన పళని స్వామి
మిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎదప్పాడి పళనిస్వామి మొదటి దెబ్బలోనే తెలుగు సిఎంలు చేయలేని పని చేశారు. తొలిరోజునే అయిదువందల మద్యం దుకాణాలనుమూసేయించారు. దీనికి సంబంధించిన ఫైలు మీద ఆయన సంతకం చేశారు. తొలిరోజు ఈ రోజు సెక్రెటేరియట్ లోని కార్యాలయం నుంచి పని చేయడం ప్రారంభించారు. కార్యాలయానికి రాగానే ఆయనకు చీఫ్ సెక్రెటరీ గిరిజా వైద్యనాథన్ స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి సీటులో కూర్చోడానికి ముందు అక్కడే ఉన్న జయలలిత చిత్ర పటానికి నివాళులర్పించారు. ఆ సమమయంలో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, ఇతరమంత్రులు కూడా ఉన్నారు.
తర్వాత ఆయన అయిదు కీలక నిర్ణయాలకు సంబంధించిన పైళ్ల మీద సంతకాలు చేసి పరిపాలనలో తన ముద్ర వేశారు.
'అమ్మ' పరిపాలన కొనసాగుతుందని, ఆమె కార్యక్రమాలను కొనసాగిస్తామనిచెబుతూ మహిళల సంక్షేమానికి చెందిన పలు నిర్ణయాలు ప్రకటించారు. ఐదు ఫైళ్లపై సంతకాలు చేసినట్టు తెలిపారు. నేడు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ, ప్రజల దృష్టిలో ఆయన ప్రతిష్టను పెంచేవి కావడం విశేషం. నేడు ఆయన సంతకాలు చేసిన పైళ్లు:
*500 ప్రభుత్వ మద్యం దుకాణాల మూసివేత
*ఉద్యోగాలు చేసే లక్ష మంది మహిళలకు 50 శాతం సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు
*ప్రసూతి సాయం రూ. 12 వేల నుంచి రూ. 18 వేలకు పెంపు
*నిరుద్యోగులకు భృతి రెట్టింపు
*రూ. 85 కోట్లతో మత్స్యకారులకు 5 వేల గృహాల నిర్మాణం