విద్యార్థులను చితకబాదిన టీచర్
- విద్యార్థులను చితకబాదిన పీఈటీ
తరగతి గదిలో మాట్లాడుతున్నారని.. ఇద్దరు విద్యార్థులను పీఈటీ చితకబాదాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థి తెలిపిన సమాచారం మేరకు.. చైతన్యపురి పరిధిలో జీనియస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో సాయి కిరణ్ ఆరో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయికిరణ్, అతని మిత్రుడు నేతాజి తరగతి గదిలో మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో క్లాస్ రూమ్ లో టీచర్ ఎవరూ లేరు. కాగా.. విద్యార్థులు మాట్లాడుకోవడాన్ని గమనించిన.. పీఈటీ సతీష్ క్లాస్ రూంలోకి వచ్చి ఇద్దరు విద్యార్థులను చితకబాదాడు.
వాతలు పడేలా ఇద్దరినీ కర్రతో కొట్టాడు. అనంతరం ఇద్దరి దగ్గర నుంచి వారి ఐడీ కార్డ్స్ కూడా లాక్కున్నాడు. స్కూల్ అయిపోయినప్పటికీ.. వారిని ఇంటికి పోనివ్వకుండా స్కూల్ లోనే ఉంచాడు. వారి తల్లిదండ్రులు వచ్చి అడిగిన తర్వాత విద్యార్థులను ఇంటికి పోనిచ్చాడు. కాగా..ఈ ఘటనపై బాలల హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తించిన పీఈటీ సతీష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 324, 75 చట్టం కింద సతీష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.