ఈదురుగాలులతో వర్షాలు: 60 మందికి పైగా మృత్యువాత
ఈదురు గాలులతో కూడిన వర్షాలు, ఇసుక తుఫాను దేశంలో నాలుగు రాష్ట్రాల్లో ఆదివారం బీభత్సం సృష్టించింది.
న్యూఢిల్లీ: ఈదురు గాలులతో కూడిన వర్షాలు, ఇసుక తుఫాను దేశంలో నాలుగు రాష్ట్రాల్లో ఆదివారం బీభత్సం సృష్టించింది. పిడుగులు పడ్డాయి. దాదాపు 60 మంది దాకా మృత్యువాత పడ్డారు. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో, దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు విధ్వంసం సృష్టించాయి.
ఆదివారంనాడు ఉత్తరప్రదేశ్ లో 8 మంది మరమించగా, పశ్చిమ బెంగాల్ లో 12 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్ మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారు.
గోడలూ చెట్లూ కూలిపోయాయి, చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 70 విమానాలను దారి మళ్లించారు. మెట్రో రైళ్ల రాకపోకపోకలు అంతరాయం కలిగింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో పిడుగుపాట్లకు 100కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. యుపిలో మథురలో బిజెపి పార్లమెంటు సభ్యురాలు హేమమాలిని కారుపై చెట్టు కూలిపడింది. గత 12 రోజుల్లో ఉత్తరప్రదేశ్ లో 102 మందికి పైగా మరణించారు.
సోమవారంనాడు యుపిలో ఇసుక తుఫాను కారణంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెప్పారు.
ఈదురుగాలుల వర్షాలకు మరణించినవారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ సానుభూతి తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పిడుగులు పడి దాదాపు 13 మరణించారు. ఢిల్లీలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.