ఫ్లిప్ కార్ట్ లో మరో అద్భుతమైన సౌలభ్యం
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ నుంచి ఇప్పటి వరకు చాలా వస్తువులు కొనుగోలు చేసే ఉంటారు. ఇక నుంచి బస్ టికెట్లు, హోటల్ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు చదివింది నిజమే.. ఫ్లిప్ కార్ట్ ఈ రకమైన సౌలభ్యాన్ని కష్టమర్ల ముందుకు తీసుకువస్తోంది. ఒకప్పుడు కేవలం పుస్తకాలమ్మే ఆన్ లైన్ స్టోర్ గా కార్యకలాపాలు మొదలు పెట్టిన ఫ్లిప్ కార్ట్ అంచెలంచెలుగా ఎదిగి.. ఇప్పుడు ఏ స్థాయికి చేరుకుందో కళ్ళారా చూస్తూనే ఉన్నాం.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ ట్రావెల్ బుకింగ్ సంస్థ మేక్ మై ట్రిప్ తో ఫ్లిప్ కార్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఇకపై స్మార్ట్ ఫోన్లు, టివిలు, ఇతర ఉత్పత్తులతో పాటు ఫ్లిప్ కార్ట్ లో బస్ టికెట్ బుకింగ్ లు, ఫ్లైట్ బుకింగ్ లు, దేశంలోని వివిధ ప్రదేశాల్లో హోటల్ బుకింగ్ చేసుకోవచ్చు. మరి కొద్ది వారాల్లో ఫ్లిప్ కార్ట్ లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఫ్లిప్ కార్ట్ తో జతకట్టడం గురించి మేక్ మై ట్రిప్ సీఈవో దీప్ కల్రా హర్షం వ్యక్తం చేశారు. ఎంతోమంది భారతీయులు ఆన్ లైన్ సేవలను పొందడం విషయంలో ఫ్లిప్ కార్ట్ , మేక్ మై ట్రిప్ లు కీలకపాత్ర పోషించాయని ఆయన అన్నారు.