తొమ్మిది మందిని బలితీసుకున్న సామూహిక భోజనం
- ఉత్తరప్రదేశ్ లో విషాదం
- తొమ్మిదిమంది అనుమానాస్పద మృతి
సరదాగా గడపడానికి వారంతా ఓ దగ్గరకు చేరుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. చాలా సేపు కబుర్లాడుకున్నారు. ఈ మాటలు, ఆటలతో కలిసిపోయిన వారంతా కలిసి సామూహిక బోజనాలు చేశారు. ఇంతా సరదాగా గడిపిన వారంతా అదే వారి చివరి బోజనం అవుతుందని ఊహించలేకపోయారు. ఇది విషాహార ప్రభావమో, కలుషిత ఆహార ప్రభావమో గాని భోజనం తిన్న 9 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. యూపి రాజధాని లక్నో సమీపంలోని థాల్ ఖుర్ద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన బంధువులందరిని పిలిచి గెట్ టుగెదర్ లాంటిది ఏర్పాటు చేశాడు. ఇలా ఇతడు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి 9 మంది భందువులు పాల్గొన్నారు. ఇలా పాల్గొన్నవారంతా కలిసి సరదాగా కూర్చుని విందు ఆరగించారు. ఇంతలో ఏం జరిగిందో తెలీదు కానీ ఈ ఆహారం తిన్నవారంతా తీవ్ర అనారోగ్యానికి గురై మృతిచెందారు.
అయితే భోజనానికి పిలిచిన వ్యక్తి మాత్రం ఈ ఆహారాన్ని తినకుండా జాగ్రత్త పడ్డాడు. అంతేకాకుండా ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించకుండా అంత్యక్రియలకు పూనుకున్నాడు. దీంతో ఈ విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అంత్యక్రియలను అడ్డుకుని తొమ్మిది మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. అయితే ఈ హత్యలకు భోజనాలను ఏర్పాటుచేసిన వ్యక్తే కారణమై ఉంటాడా ? లేకపోతే కలుషిత ఆహారం తిని మరణించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.