మక్కా పేలుళ్ల కేసులో అలజడి.. ఎన్ఐఎ జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా
న్యాయవ్యవస్థలో మరో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా ఒక జడ్జి తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా కూడా తీవ్ర సంచలనం రేపిన కేసులో తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే రాజీనామా చేశారు. జడ్జి రాజీనామా వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.
న్యాయవ్యవస్థలో మరో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా ఒక జడ్జి తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా కూడా తీవ్ర సంచలనం రేపిన కేసులో తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే రాజీనామా చేశారు. జడ్జి రాజీనామా వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
11 ఏండ్ల క్రితం మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టులో సోమవారం తీర్పు వెలువడింది. అయితే ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా కోర్టు తీర్పులో ప్రకటించింది. అయితే 11 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణ.. తదుపరి తీర్పు వెలువడడం సంగతి అటుంచితే.. ఈకేసులో తీర్పు వెలువరించిన జడ్జి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తీర్పు ఇచ్చిన 24 గంటలు గడవకముందే జడ్జీ రాజీనామా చేయడం పెద్ద సంచలనం రేపింది.
జడ్జి రవీందర్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారన్నదానిపై రకరకాల వాదనలు వినబడుతున్నాయి. ఆయనపై ఏమైనా రాజకీయ వత్తిళ్లు పనిచేశాయా? అన్న కోణంలో చర్చలు సాగుతున్నాయి. జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా చేసిన విషయమై ఆయన స్నేహితులు కూడా కారణాలను ఆరా తీస్తున్నారు. మరో విషయమేమంటే రవీందర్ రెడ్డి మరో రెండు నెలల్లోనే పదవీ విరమణ చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేయడంతో అలజడి రేగుతోంది.
జడ్జి రవీందర్ రెడ్డితోపాటు మరో ఇద్దరు రాజీనామా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. రవీందర్ రెడ్డి బాటలోనే వారు పయనిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం జూనియర్ సివిల్ జడ్జిల అసోసియేషన్ కు రవీందర్ రెడ్డి అధ్యక్షులు గా పనిచేస్తున్నారు. మక్కా కేసులో తీర్పు వెలువరించిన వెంటనే ఆయన రాజీనామా చేయడానికి ఈ కేసులో వత్తిళ్లు ఉన్నాయా? లేక వేరే అంశాలు ఏమైనా ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది.
మరోవైపు విచారణ జరిగిన తీరుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్ఐఎ తీరు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందన్నారు. పూర్తి సాక్ష్యాధారాలున్నా ఎన్ఐఎ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఈ విచారణ ఏమాత్రం ప్రొఫెషనల్ గా సాగలేదని మండిపడ్డారు.