కన్న కొడుకును రాడ్ తో కొట్టి చంపిన తల్లి
ఆస్తి గొడవల కారణంగానే...
ఆస్తి కోసం జరిగిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జులాయిగా తిరగుతూ ఆస్తి కోసం వేధిస్తున్న కన్న కొడుకును ఓ తల్లి రాడ్ తో కొట్టి చంపిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని జగన్నాథపురం గ్రామంలో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జగన్నాథపురం గ్రామంలో నివాసముంటున్న ప్రతాప్ రెడ్డి, పార్వతి దంపుతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దవాడైన శివరామ కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో చెడు సావాసాల బాట పట్టిన ఇతడు జల్సాలకుమ అలవాటు పడ్డాడు. ఇలా జల్సాలు చేయడం కోసం డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించేవాడు.
ఈ మద్య కాలంలో తల్లిందండ్రులను వేధించడం ఎక్కువ చేశాడు శివరామ కృష్ణారెడ్డి. తనకు ఆస్తి పంచాలంటూ తరచూ తల్లితో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో అతడు తనకు 50 లక్షలు అవసరం ఉందని, ఎలాగైనా సమకూర్చాలని తల్లితో గొడవకు దిగాడు. అంత డబ్బు తన వద్ద లేదని పార్వతి చెప్పడంతో ఆగ్రహానికి లోనైన అతడు తల్లిపై రాడ్ తో దాడికి ప్రయత్నించాడు. ఈ దాడి నుండి తప్పించుకున్న పార్వతి ఆత్మరక్షణ కోసం అదే రాడ్ తో కొడుకుపై దాడి చేసింది. దీంతో అతడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ హత్య అనంతరం పార్వతి నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకుని లొంగిపోయారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.