‘జగన్.. శవాలపై పైసలు ఏరుకుంటాడు’
జగన్ పై మంత్రి సంచలన వ్యాఖ్యలు
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్.. శవాలపై పైసలు ఎరుకునే రకం అని ఆరోపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే... రెండు రోజుల క్రితం గోదావరిలో పడవ మునిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 40మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై మంత్రి స్పందించారు.
ప్రకృతి వైపరీత్య వల్లే గోదావరి పడవ ప్రమాదం జరిగిందని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. పడవ ప్రమాదం ఎంతో దురదృష్టకరమైన సంఘట అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గోదావరిలో లాంచీ ప్రమాదంపై ప్రతిపక్ష నేత జగన్ స్పందించకపోవడంపై మంత్రి మంపడ్డారు. మానవత్వం ఉన్న ఎవరైనా ఈ ఘటనపై స్పందిస్తారని...కానీ ప్రతిపక్ష నేత జగన్ వైఖరి సిగ్గు చేటన్నారు.
కోర్టుకు వెళ్లేందుకు పాదయాత్రను ఆపివేసిన జగన్ గిరిజనులు చనిపోతే కనీసం పరామర్శించలేరా అని ప్రశ్నించారు. గోదావరి జిల్లాలో పాదయాత్ర చూస్తూ బాధితులను పరామర్శించలేదని మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పైగా సర్కారీ హత్యలని అనడానికి సిగ్గు ఉండాలన్నారు. శవాలపై పైసలు ఏరుకునే రకం జగన్ అని విమర్శించారు. వైఎస్ హయాంలో ఎన్నో ఘటనలు జరిగి ప్రజల ప్రాణాలు పోతే అవి సర్కారీ హత్యలేనా? అని...వైఎస్ పాలనలో మక్కా మసీద్లో పేలీన బాంబ్లు ఆ ప్రభుత్వమే పెట్టించిందా అని నిలదీశారు.
ప్రమాదంపై కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపైనా మంత్రి మండిపడ్డారు. కన్నా స్వచ్చమైన సంఘ్ కార్యకర్తలా మాట్లాడాటం హాస్యస్పదమన్నారు. పదవుల కోసం వారం రోజుల్లో రెండు పార్టీలతో కన్నా దోబుచులాట ఆడారని దుయ్యబట్టారు. కన్నాకు సిగ్గులేకపోయినా బ్యానర్లు కట్టే కార్యకర్తలకైనా సిగ్గు ఉండాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో సీఎం పదవి కోసం పాకులాడిన చందంగానే నేడు బీజేపీ అధ్యక్ష పదవి కోసం కన్నా పాకులాడారని ఆరోపించారు. కన్నాకు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల మనోభావాలు అవసరం లేదని, బీజేపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుందని మంత్రి నక్కా ఆనందబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.