రికార్డు సృష్టించిన మారుతీ సుజుకీ
- మారుతీ సుజీకీ.. సరికొత్త రికార్డు సృష్టించింది.
భారత దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజీకీ.. సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలతో భారత్లో 35 లక్షల కార్లను విక్రయించినట్లు కంపెనీ బుధవారం వెల్లడించింది. దేశంలో తొలిసారి ఈ మైలురాయిని అందుకున్న బ్రాండ్గా ఆల్టో చరిత్ర సృష్టించింది. ప్రతి ఏడాది అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ కూడా ఇదే కావడం విశేషం. 2000 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆల్టో మోడల్ను మారుతీ విడుదల చేసింది. అప్పటి నుంచి అన్ని సెగ్మెంట్లలో కలిపి వరుసగా 14ఏళ్లపాటు తన హవా కొనసాగిస్తోంది.
2006 నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఆల్టో విభాగంలో ఐదు లక్షలకు పైగా కార్లను విక్రయించామని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఆల్టో రెండు ఇంజిన్ రకాలతో అందుబాటులో ఉంది. 800సీసీ, కే10తో పాటు సీఎన్జీ ఫ్యూయల్ వేరియంట్లో లభిస్తోంది. 30ఏళ్లలోపు వయసు వాళ్లే ఎక్కువగా ఈ కార్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.