ఉత్త ప్రకటనలుకాదు, కడప ఉక్కు ప్రకటనలు కావాలి
- కడప జిల్లాలో పూర్తిస్థాయి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు క్యాలెండర్ ప్రకటించాలి
- అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలప్పటిలాగా ఏకాభిప్రాయంతో ఉక్కు ఫ్యాక్టరీ కోసం కృషిచేయాలి
ప్రొద్దుటూరు: కడప ఉక్కు ఆంధ్రుల హక్కుగా యావత్ ఆంధ్రరాష్ట్రం నినదించి, రాయలసీమకు న్యాయం జరగిందుకు కదలాల్సిన సమయం వచ్చిందిని కడప స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఆనాడు విశాఖ ఉక్కుకోసం రాయలసీమ వాసులు ఎన్నో త్యాగాలు, ఉద్యమాలు చేశారని, నేడు కడప ఉక్కు కోసం అందరూ ఉద్యమించాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ విషయం మీద ఆయన విలేకరులతో ఆయన మాట్లాడారు.
‘నేడు రాయలసీమలో వలసలు ఆగిపోవాలంటే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఒక్కటే పరిష్కరం. స్టీల్ ప్లాంటు కోసం రెండేళ్ళుగా స్టీల్ప్లాంటు సాధన సమితి చేసిన ఉద్యమాల కారణంగానే నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్యలకు ఉపక్రమించాయి. అయితే స్టీల్ ప్లాంటు విషయంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు విరుద్ద ప్రకటనలు చేస్తూ గందరగోళానికి గురిచేస్తున్నారు,’ అని ఆయన అన్నారు.
రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు సిద్ధమైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేసి తమ నిజాయితీని, కమిట్ మెంట్ ని నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు.
‘ఇంతవరకు జరగిన ఆలస్యం చాలు, ఎప్పుడు స్టీల్ ప్లాంటు పునాది రాయి వేస్తారు, ఎపుడు ప్రారంభిస్తారు, ప్లాంటు గురించి ఒక్ టైంటేబుల్ ప్రకటించకపోతే ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికిగురి కావలసి వస్తుంది,’ అని ఆయన హెచ్చరిక చేశారు.
చిత్తశుద్ది ఉంటే రాష్ట్ర పతి ఎన్నికలకు అన్ని రాజకీయపార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చాయో. రాయలసీమలో ఏర్పాటు చేసే ఉక్కు పరిశ్రమ విషయంలో ఏకాభిప్రాయంతో, రూట్ మ్యాప్ ఎందుకు ప్రకటించలేకపోతున్నారని ప్రవీణ్ ప్రశ్నించారు.
తమ ఉక్కు ఫ్యాక్టరీ డిమాండ్ గురించి వివరిస్తూ, ‘విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 1.5 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యం ఉన్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటే ఏర్పాటే చేయాలి, అలా కాకుండా ఏదో అనుబంధ పరిశ్రమను ఏర్పాటు చేసి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. దీన్ని రాయలసీమ ప్రజలెవరూ హర్షించరు. ఉక్కుఉద్యమం మరింత తీవ్రతరం అవతుందని ప్రభుత్వాల్ని హెచ్చరిస్తున్నాం,’ అని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉక్కు వత్తిడి తెచ్చేందుకు జనవరి 24న ప్రొద్దుటూరులో తలపెట్టిన భారీ మార్చ్ ఫాస్ట్ చేపడుతున్నామని, రాయలసీమ అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తులు, వర్గాలు, విద్యార్ధులు, సంఘాలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.
ఈ మార్చ్ ఫాస్టు వివరాలను ఆయన విడుదల చేశారు.
పట్టణంలోని గాంధీరోడ్డులోని ఎస్బిఐ దగ్గర నుంచి మార్చ్పాస్ట్ మొదలై విజయకుమార్ సర్కిల్, టిబి రోడ్డు, రాజీవ్ సర్కిల్, శివాలయం వీధి మీదుగా పుట్టపర్తి సర్కిల్ వరకు సాగుతుంది. ఇందులో వేలాది మంది విద్యార్థులు, ప్రజలు హాజరవుతున్నారు. పుట్టపర్తి సర్కిల్ లో బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలోనే భవిష్యత్ ఉద్యమ ప్రణాళికను కూడా ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
24న జరిగే మార్చ్పాస్ట్లో ప్రతి ఉక్కు సైనికుడు వేసే ప్రతి అడుగూ స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు నాంది అవుతుందని, ఈ అడుగుతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతాయన్నారు. ఉక్కుపాక్టరీ ఇవ్వకపోతే భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ తిరగలేని పరిస్థితి వస్తుందని ప్రవీణ్రెడ్డి హెచ్చరించారు.ఈ మార్చ్పాస్ట్ సుమారు 60 సంఘాలకు పైగా మద్దుతు తెలిపారన్నారు. 24న స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూసివేసి, ఉద్యమంలో వివిధ వ్యాపార వర్గాల వారు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సమావేశంలో స్టీల్ప్లాంటు సాధన సమితి నాయకులు ఎన్.ఎస్.ఖలందర్, ఓబుళరెడ్డి తదితరులు పాల్గొన్నారు.