ధోనికి బీసీసీఐ షాక్..?
- టాప్ గ్రేడ్ నుంచి ధోని పేరును తొలగించడానికి బీసీసీఐ కసరత్తులు చేస్తోందనే ప్రచారం ఊపందుకుంది.
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కి బీసీసీఐ పెద్ద షాక్ ఇవ్వనుందా..? అవుననే సమాధానం వినపడుతోంది. టాప్ గ్రేడ్ నుంచి ధోని పేరును తొలగించడానికి బీసీసీఐ కసరత్తులు చేస్తోందనే ప్రచారం ఊపందుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రికెటర్ల జీతాలు పెంచాలని గత ఏడాది నవంబరు 30న విరాట్ కోహ్లీ, ధోనీతో పాటు కోచ్ రవిశాస్త్రి బీసీసీఐ సీవోఏ (కమిటీ ఆఫ్ అథారటీస్) ని కోరిన సంగతి తెలిసిందే.
దీనిపై కసరత్తులు చేపట్టిన సీవోఏ కొన్ని మార్పులు, చేర్పులతో ఇప్పటికే తుది నివేదిక తయారు చేసిందట. దీన్ని త్వరలో బీసీసీఐ ఫైనాన్స్ కమిటీకి అందజేయనుంది. ఏ ప్లస్, ఏ, బీ, సీ ఇలా నాలుగు శ్రేణుల ద్వారా ఆటగాళ్లకు జీతాలు అందజేసే అవకాశం ఉంది. ఈ తాజా నివేదికలో ధోనీ తన అగ్రశ్రేణి కాంట్రాక్టును కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు, వన్డే, టీ20 ఈ మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లను మాత్రమే ఏ ప్లస్ క్యాటగిరిలో చేర్చుతారు. కాగా ధోని ఇప్పటికే అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కి వీడ్కోలు చెప్పిన సంగతి విదితమే. దీంతో.. ఏ ప్లేయర్ ఏ శ్రేణిలో చోటు దక్కించుకుంటాడనే విషయంపై సర్వత్రా ఆసక్తి మొదలైంది.