29 నిమిషాల్లో గుండె ఆపరేషన్: కర్నూల్ పెద్దాసుపత్రి రికార్డు
గంటన్నర పట్టే ఆపరేషన్ను 29 నిముషాల్లో పూర్తి చేశారు
మామూలుగా ప్రభుత్వాసుపత్రులంటే చిన్న చూపు. శుభ్రత దగ్గిర నుంచి చికిత్స దాకా ప్రభుత్వాసుపత్రికి మంచిమార్కులుపడటం కష్టం. అయితే, ప్రభుత్వాసుప్రతులలో టాలెంట్ కు ఏ మాత్రం కొరత లేదు. ఏకార్పొరేట్ ఆసుప్రతికి తీసిపోనంత నైపుణ్యం ప్రభుత్వాసుపత్రులలో పనిచేసే డాక్టర్ల దగ్గిర ఉంది. పెద్ద పెద్ద ఆపరేషన్లు, అరుదైన ఆపరేషన్లు చాలా వరకు మొదట జరిగింది,అరకొర వసతులుండే ప్రభుత్వాసుపత్రులలోనే. ఇపుడిది మరొకసారి కర్నూల్ జనరల్ ఆసుపత్రిలో రుజువయింది. అక్కడికార్డియో థొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ సి.ప్రభాకర్రెడ్డి 29 నిమిషాలలో గుండె ఆపరేషన్ చేసి రికార్డు సృష్టించాడు. ఆయన నాయకత్వంలో డాక్టర్లు అతి క్లిష్టమైన మూడు శస్త్ర చికిత్సలను సమయస్ఫూర్తిగా ఒకేరోజు చేసి ముగ్గురి ప్రాణాలను కాపాడారు.
పసిపాపకు పాలివ్వలేక ఆయాస పడటమే కాకుండా భర్త నిరాదరణకు గురైన ఒక మహిళకు 29 నిముషాల్లోనే ఆపరేషన్ పూర్తి చేశారు.
ఇదొక జాతీయ స్థాయి రికార్డు. ఇలాగే మరొక రెండు ఆపరేషన్లు వెంటవెంటనే చేశారు. అనంతరం ఈ ఆపరేషన్ల గురించి డాక్టర ప్రభాకర్ రెడ్డి మీడియాకు వివరాలు అందించారు.
' ఖాయిలా పడ్డ సువర్ణ వయసు 25 ఏళ్లు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, గుడేకల్ ఆమె స్వగ్రామం. విపరీతమైన దగ్గు, ఆయాసంతో 7 నెలలుగా బాధపడుతూ ఉంది. పసిపాపకు పాలివ్వలేని పరిస్థితి. ఈ పరిస్థితులలో భర్త కూడా ఆమెను వదిలేశాడు. తల్లిదండ్రుల సహాయంతో ఆసుపత్రికి వచ్చింది. పరీక్షించగా ఆమెకున్న జబ్బును మైట్రల్ స్టెనోసిస్గా గుర్తించాం. ఆపరేషన్కు కనీసం ఆరు సీసాల రక్తంకావాలి. క్రాస్క్లాంప్ను ఏర్పాటు చేసి.. గంటన్నర పట్టే ఆపరేషన్ను 29 నిముషాల్లో పూర్తి చేశాం. ఇది జాతీయస్థాయి రికార్డు. రక్తం కోల్పోలేదు. 29 నిముషాల్లోనే ఆపరేషన్ పూర్తి చేయడం వల్ల రోగి త్వరగా కోలుకుంది.
ఇలాగే కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన గిడ్డయ్య వయసు 45 ఏళ్లు. గుండెదడతో ఆస్పత్రికి వచ్చాడు. అతనికి ఉన్న జబ్బును ఆయోర్టిక్ స్టెనోసిస్. రొమ్మును కోసి ఆపరేషన్ చేస్తే అతను కోలుకోవడానికి సుమారు రెండేళ్లు పడుతుంది. కూలిపని చేసుకునే శ్రామికుడు కాబట్టి ప్రత్యాయమ్నయ మార్గం ఆలోచించాం. 'మినిమల్లీ ఇన్వేస్సివ్ కార్డియాక్ సర్జరీ' లో రొమ్ము ఎముకను కట్ చేయకుండా రెండు పక్కటెముకల మధ్య 8 సెంమీ గాటు పెట్టాం. కిటికీలో నుంచి చూస్తున్నట్లుగా ఈ గాటులో నుంచి చూస్తూ అయోర్టిక్ వాల్వ్ ను విజయవంతంగా రీప్లేస్ చేశాం. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇందుకు రు 5 నుంచి రు. 6 లక్షలు ఖర్చవుతాయి. ఈ సర్జరీ వల్ల రోగి నెలలోపే కోలుకుంటాడు. ఈ ఆపరేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే ఉంది.
కడప జిల్లా కుడిగండ్లపల్లి కి చెందిన వెంకట్రామిరెడ్డి పరిస్థితి చూద్దాం. ఆయన వయసు 72 ఏళ్లు. హత్య కేసులో కడప కేంద్ర కర్మాగారంలో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. విపరీతమైన ఛాతినొప్పి, ఆయాసం రావడంతో పెద్దాసుపత్రికి తెచ్చారు. ఇతని జబ్బును 'కరోనరి ఆర్టరీ డిసీజ్'. జైళ్లశాఖ అనుమతితో బీటింగ్ హార్ట్సర్జరీని మూడు గంటల్లో పూర్తి చేశాం. పరికరాలు, మెడిషన్ సమకూర్చిన పైఅధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు.'అని చెప్పారు. ఇదీ సంగతి.