కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
- నలుగురు మృతి
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శిరివెళ్ల మండలం వెంకటాపురం వద్ద ఓ బైక్ ను వెనకనుంచి వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆళ్లగడ్డ సమీపంలోని పెద్దచింతకుంటకు చెందిన ఉసేనయ్య(40), దస్తగిరమ్మ(38), ఫాతిమా(35), ధనుంజయుడు(11) లకు నంద్యాలలో పని ఉండటంతో వెళ్లారు. నంద్యాలలో పని ముగించుకుని ఒకే బైక్ పై నలుగురు ఆళ్లగడ్డకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో 40వ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ ఘటన ప్రాంతం నుంచి పరారయ్యాడు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.