ఎంపీ భార్యకు లైంగిక వేధింపులు
- తాను లైంగిక వేధింపులకు గురయ్యానన్న ఎంపీ భార్య
తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానంటూ ఓ ఎంపీ భార్య చేసిన వ్యాఖ్యాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. కేరళ కాంగ్రెస్ చీఫ్ కేఎం మణి కోడలు, ఎంపీ జోస్ మణి భార్య నిషా జోస్ ఈ విషయాన్ని తాజాగా తెలియజేశారు. ఆమె తనపై తాను రాసుకున్న ‘‘ది అదర్ సైట్ ఆఫ్ దిస్ లైఫ్- స్నిప్పెట్స్ ఆఫ్ మై లైఫ్ యాస్ ఎ పొలిటీషియన్స్ వైఫ్’’ అనే బుక్ను తాజాగా విడుదల చేశారు. కాగా ఒకానొక సమయంలో తాను ఎదర్కొన్న లైంగిక వేధింపులను ఆమె ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
తాను రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ రాజకీయ నేత కుమారుడు తనతో అసభ్యంగా ప్రవర్తించారని నిషా చెప్పారు. 2012లో ఈ ఘటన జరిగిందని.. చాలాసార్లు తన కాలిని ఆయన తాకారని నిషా చెప్పారు. ఇదే విషయాన్ని అక్కడే ఉన్న ట్రెయిన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)కు చెప్పినా.. ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. ఆయనపై చర్య తీసుకుంటే తన ఉద్యోగానికే ముప్పని ఆయన చెప్పినట్లు నిషా తెలిపారు. దీనిపై పై అధికారులకు కూడా లేఖ రాసినట్లు ఆమె వివరించారు.
కాగా.. ప్రస్తుతం ఆమె చేసిన ఆరోపణులు కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఆమె పై వేధింపులకు పాల్పడిన ఆ వ్యక్తి పేరు బయట పెట్టాలని ఆ ఎమ్మెల్యే పీసీ జార్జ్ తనయుడు షోన్ జార్జ్ డిమాండ్ చేశారు. నిషా అతని పేరు చెప్పకపోవడం వల్ల కొందరు తనను అనుమానిస్తున్నట్లు ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన బుక్ను అమ్ముకోవడానికే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని షోన్ జార్జ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.