పనిచేయని లింగాయత్ అస్త్రం: కాంగ్రెసును దెబ్బ కొట్టిన జెడిఎస్
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు ప్రయోగించిన లింగాయత్ అస్త్రం పనిచేయలేదు.
బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు ప్రయోగించిన లింగాయత్ అస్త్రం పనిచేయలేదు. యడ్డ్యూరప్పను బిజెపి తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో లింగాయత్ లు బిజెపికి మద్దతు ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. అంతేకాకుండా, లింగాయత్ లను బుజ్జగించడం వల్ల ఇతర వర్గాలు కాంగ్రెసుకు దూరమైనట్లు కూడా అంచనా వేస్తున్నారు.
కాంగ్రెసును దేవెగౌడ నేతృత్వంలోని జెడిఎస్ దెబ్బ తీవ్రంగా దెబ్బ కొట్టినట్లే కనిపిస్తోంది. జెడిఎస్ ఊహించని విధంగా ఫలితాలు సాధిస్తోంది. దక్షిణ కర్ణాటకలో కాంగ్రెసును జెడిఎస్ దెబ్బ తీసింది. ముంబై కర్ణాటకలో, బెంగళూరు నగరంలో బిజెపి ఆధిక్యత ప్రదర్శించింది.
గాలి సోదరులు బిజెపికి బలంగా మారారు. గాలి జనార్దన్ రెడ్డిపై ఉన్న అవినీతి ఆరోపణలు బిజెపికి ఏ మాత్రం నష్టం చేసినట్లు లేదు. కోస్తా కర్ణాటకలో కూడా బిజెపి హవా కొనసాగింది. హైదరాబాదు కర్ణాటకలో బిజెపికి కాంగ్రెసు కాస్తా పోటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది.
బిజెపి సాధారణ మెజారిటీ దిశగా కొనసాగుతోంది. ఇప్పటికే 111 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి.