విశ్వాస తీర్మానాన్ని నెగ్గడానికి ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పకు 111 సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది.

బెంగళూరు: విశ్వాస తీర్మానాన్ని నెగ్గడానికి ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పకు 111 సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. గతంలో రెండుసార్లు గట్టెక్కించిన బోపయ్య ప్రోటెమ్ స్పీకర్ గా ఉన్నారు కాబట్టి యడ్యూరప్ప బహుశా ధీమాగా ఉండి ఉండవచ్చు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

శనివారం సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ప శాసనసభలో బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయనకు 111 మంది సభ్యుల బలం అవసరం కాగా, బిజెపికి 104 మంది సభ్యులున్నారు. కాంగ్రెసు, జెడిఎస్ కూటమికి 115 మంది సభ్యులున్నారు. అయినప్పటికీ తాను గెలుస్తానని యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విశ్వాస పరీక్షలో గట్టెక్కడానికి బిజెపికి మరో 8 మంది సభ్యుల మద్దతు అవసరం. సమయానికి కాంగ్రెసు, జెడిఎస్ సభ్యులు కొంత మంది తమకు అనుకూలంగా వ్యవహరిస్తారని బిజెపి భావిస్తున్నట్లు కనిపిస్తోంది. 

బిజెపి ముందు ఆప్షన్లు ఇవే....

ఆప్షన్ 1: కాంగ్రెసు, జెడిఎస్ సభ్యుల్లో కొంత మంది పార్టీల విప్ లను ధిక్కరించి బిజెపికి అనుకూలంగా ఓటు చేయడం.

ఆప్షన్ 2: జెడిఎస్, కాంగ్రెసు సభ్యుల్లో కొంత మంది శాసనసభకు గైర్హాజరు అయ్యేలా చూడడం. తద్వారా మెజారిటీకి అవసరమైన సంఖ్యను తగ్గించడం. ఇందుకు దాదాపు 14 నుంచి 15 మంది సభ్యులు శాసనసభకు డుమ్మా కొట్టాల్సి ఉంటుంది. 

ఆప్షన్ 3: కాంగ్రెసు, జెడిఎస్ సభ్యుల్లో కొంత మంది చేత రాజీనామాలు చేయించడం. అయితే, కాస్తా చిక్కుల్లో పడేసే ఆప్షన్. వెంటనే రాజీనామాలను ఆమోదించే అవకాశం ఉండకపోవచ్చు. స్పీకర్ వాటిపై విచారణ జరిపిన తర్వాత ఆమోదం తెలపాల్సి ఉంటుంది. 

ఆప్షన్స్ 4: కాంగ్రెసు, జెడిఎస్ సభ్యుల్లో కొంత మంది ఓటు వేయకుండా తటస్థంగా ఉండిపోవడం. దానివల్ల కూడా మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలాన్ని తగ్గించవచ్చు.

ఆప్షన్స్ 5: ఓటమి తప్పదని భావిస్తే కొంత మంది బిజెపి సభ్యులు సభలో గందరగోళం సృష్టించడం. తద్వారా సభ వాయిదా పడేలా చూడడం. 

యడ్యూరప్ప బలాన్ని నిరూపించుకోలేకపోతే ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత గవర్నర్ కాంగ్రెసు, బిజెపి కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, బలనిరూపణకు ఆదేశించే అవకాశం ఉంటుంది.