కర్ణాటక బలపరీక్ష: ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిస్, సోమశేఖర రెడ్డి సైతం...
ఇద్దరు కాంగ్రెసు శాసనసభ్యులు ఇప్పటి వరకు కర్ణాటక విధాన సౌధకు చేరుకోలేదు.
బెంగళూరు: ఇద్దరు కాంగ్రెసు శాసనసభ్యులు ఇప్పటి వరకు కర్ణాటక విధాన సౌధకు చేరుకోలేదు. ఓ వైపు ఎమ్మెల్యేల చేత ప్రోటెమ్ స్పీకర్ బోపయ్య ప్రమాణ స్వీకారం చేయిస్తుండగా, వారి ఆచూకీ మాత్రం లేదు. కాంగ్రెసు శాసనసభ్యులు ఆనంద సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ విధాన సౌధకు చేరుకోలేదు.
అజ్ఞాతంలోకి వెళ్లిన ఆనంద సింగ్ హైదరాబాదు శనివారం ఉదయం దర్శనమిచ్చారు. ఆయన విమానంలో బెంగళూరు చేరుకుంటారని భావించారు. కానీ ఇంత వరకు విధాన సౌధకు మాత్రం చేరుకోలేదు.
ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వెంట మాజీ మంత్రి హెచ్ఎం రేవణ్ణ, ఎమ్మెల్సీ రిజ్వాన్ అర్షద్ ఉన్నారని, విధానసౌధకు వారు వస్తారని బెంగళూరు రూరల్ ఎమ్మెల్యే డికె సురేష్ చెబుతున్నారు.
కాగా, బిజెపి నుంచి శాసనసభకు ఎన్నికైన గాలి సోమశేఖర రెడ్డి కూడా విధాన సౌధకు చేరుకోలేదు.