శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కర్ణాటక కాంగ్రెసు, జెడిఎస్ హైదరాబాదులో ఖరారు చేశారు.

హైదరాబాద్: శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కర్ణాటక కాంగ్రెసు, జెడిఎస్ హైదరాబాదులో ఖరారు చేశారు. శనివారం సాయంత్రం యడ్యూరప్ప శాసనసభలో ఎదుర్కునే విశ్వాస పరీక్షపై వ్యూహాన్ని ఖరారు చేశారు. హైదరాబాదులోని తాజ్ కృష్ణా హటల్లో సిఎల్పీ సమావేశం జరిగింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సిఎల్పీ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరయ్యారు. జెడిఎస్ నాయకుడు కుమారస్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొనడానికి బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. బలపరీక్షపై కాంగ్రెసు నాయకత్వం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసింది. 

ఇదిలావుంటే, ప్రోటెం స్పీకర్ గా బోపయ్యను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ జెడిఎస్ నేత రేవణ్ణ గవర్నర్ వాజుభాయ్ వాలాకు లేఖ రాశారు. తన నిర్ణయాన్ని గవర్నర్ తిరిగి సమీక్షించుకోవాలని ఆయన కోరారు. 

కాగా, బిజెపి శాసనసభా పక్ష సమావేశం రాత్రి 9 గంటలకు బెంగళూరులో జరగనుంది. ఈ సమావేశంలో బిజెపి నాయకులు కూడా పాల్గొంటున్నారు. తమ 78 మంది ఎమ్మెల్యేలు తాజ్ కృష్ణాలోనే ఉన్నారని కాంగ్రెసు నేత బసవరాజు చెప్పారు. కాంగ్రెసు, జెడిఎస్ ఎమ్మెల్యేలు కొంత మంది బిజెపికి టచ్ లో ఉన్నారనే వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు.

రేపు ఉదయం 11 గంటలకు కర్ణాటక శాసనసభ ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుంది. తొలుత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రోటెం స్పీకర్ వారి చేత ప్రమాణం చేయిస్తారు. సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ప బలనిరూపణ జరుగుతుంది. 

కాంగ్రెసు, జెడిఎస్ ఎమ్మెల్యేలు బస్సుల్లో ఈ రాత్రి బెంగళూరు బయలుదేరే అవకాశం ఉంది.