కర్ణాటక డ్రామా: ఎవరీ వాజూభాయ్ వాలా, ఏం చేస్తారు?
ఏ పార్టీకీ తగిన మెజారిటీ రాని పరిస్థితిలో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ వాజూభాయ్ వాలా ఎవరిని ఆహ్వానిస్తారనేది ఆసక్తికరంగానే కాకుండా ఉత్కంఠగా కూడా మారింది.
బెంగళూరు: ఏ పార్టీకీ తగిన మెజారిటీ రాని పరిస్థితిలో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ వాజూభాయ్ వాలా ఎవరిని ఆహ్వానిస్తారనేది ఆసక్తికరంగానే కాకుండా ఉత్కంఠగా కూడా మారింది. కాంగ్రెసు, జెడిఎస్ ఓ అవగాహనకు వచ్చి తమకు మెజారిటీ ఉన్నందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాయి. కానీ, వాజూభాయ్ వాలా ఏమీ చెప్పకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు.
ఇదే సమయంలో అతి పెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, రేపే గురువారం ప్రమాణ స్వీకారం చేయించాలని బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప గవర్నర్ ను కోరారు. దాంతో గవర్నర్ బిజెపి అనుకూలంగా వ్యవహరిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ అనుమానాలకు కారణం లేకపోలేదు. బిజెపి ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమని జాతీయ మీడియాలో వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆయన గుజతార్ శాసనసభకు రాజ్ కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ప్రాతినిధ్యం వహించారు. అది ఓ రికార్డు.
ఆయన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా, శాసనసభ స్పీకర్ గా, మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం 80 ఏళ్ల వయస్సులో ఉన్న వాలా 2002 మోడీని గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కోసం రాజ్ కోట్ సీటును ఖాళీ చేశారు. ఆయనకు ప్రథమ ప్రాధాన్యం పార్టీయేనని అంటారు.
ఎవరు చెప్పినా వింటారు. ప్రతి ఒక్కరితోనూ హాస్యమాడుతారు. కానీ తాను ఏం చేయాలనుకుంటారో అదే చేస్తారని అంటారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారు. ఆర్ఎస్ఎస్ లో ఆయన 1971లో చోరారు. ఆయనను పానీవాలా మేయర్ గా పిలుస్తారు. రైళ్ల ద్వారా రాజ్ కోట్ కు ఆయన నీటిని తెప్పించడం ఆయనకు ఆ పేరు వచ్చింది.
గుజరాత్ లో మోడీ మంత్రివర్గంలో తొమ్నిదేళ్ల పాటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయనను 2014లో మోడీ కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గా నియమించింది.