రసకందాయంలో కర్నాటకం: గవర్నర్ ముందు ఆప్షన్లు ఇవీ..
ర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. ఈ స్థితిలో అందరి చూపూ రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా పైనే ఉంది.
బెంగళూరు: కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. ఈ స్థితిలో అందరి చూపూ రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా పైనే ఉంది. కూటమి కట్టి తమకు మెజారిటీ ఉందని చెబుతున్న కాంగ్రెసు- జెడిఎస్ లను పిలుస్తారా, అతి పెద్ద పార్టీగా అవతరించిన బిజెపిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పిలుస్తారా అనేది తేలడం లేదు.
రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఆయన బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పతో చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తొలి అవకాశం దక్కించుకున్నవాళ్లు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
గవర్నర్ ముందు ప్రధానంగా మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడిన జేడీఎస్ నేత కుమారస్వామిని ఆహ్వానించడం ఒకటి కాగా, అత్యధిక స్థానాలున గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానింంచి. బల నిరూపణకు గడువు నిర్దేశించడం. మూడోది అసెంబ్లీని సస్పెన్షన్ లో ఉంచడం.
ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు, బిజెపికి చెందినవాడు కావడం వల్ల వాజుభాయ్ కుమారస్వామికి తొలి అవకాశం ఇస్తారా అనేది సందేహం. ఎవరిని ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించాలనేది గవర్నర్ విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. నియమ నిబంధనల మాట ఎలా ఉన్నా చివరకు పనిచేసేది అదే.
తన విచక్షణాధికారాలను ఉపయోగించి యడ్యూరప్పకు తొలి అవకాశం ఇస్తారని, తద్వారా కర్ణాటకలో తమ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తారని బిజెపి నాయకులు ఆశిస్తున్నారు. బలనిరూపణలో యడ్యూరప్ప విఫలమైతేనే కుమారస్వామికి అవకాశం దక్కుతుంది.
బలనిరూపణకు ఏర్పాటు చేసే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల స్పీకర్ వ్యవహారంలో కీలకం కానున్నారు. బలనిరూపణ సమయంలో నిర్ణయాధికారం స్పీకర్ కే ఉంటుంది. పార్టీ మారే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం కూడా ఆయనకు ఉంటుంది.