క్షమాపణలు చెప్పిన కమల్ హాసన్
- పెద్దనోట్ల రద్దు విషయంలో తొందరపడి మద్దతు తెలిపానన్న కమల్
- అందుకు క్షమాపణలు తెలిపిన కమల్
- తన తప్పును ప్రధాని మోదీ కూడా అంగీకరించాలని కోరిన కమల్
విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రజలందరికీ క్షమాపణలు తెలిపారు. అంతేకాదు.. తాను చేసిన తప్పును ప్రధాని నరేంద్రమోదీ అంగీకరించాలని ఆయన కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది ప్రధాని నరేంద్రమోదీ.. పెద్దనోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కమల్ ఆ సమయంలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. పార్టీలకు అతీతంగా మోదీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ మెచ్చుకోవాలని ట్వీట్ చేశారు.
అయితే.. పెద్దనోట్ల రద్దును తొందరపడి సమర్థించడం తప్పని ఆయన తెలుసుకున్నారట. అందుకే తాను క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. ‘ ఆనంద్ వికటన్’ అనే తమిళ పత్రిక కాలమ్ లో ఆయన ఈ విషయం రాశారు. అంతేకాదు.. తన తప్పును మోదీ అంగీకరిస్తే.. ఆయనకు మరో సలామ్ సిద్ధంగా ఉంటుందని కమల్ పేర్కొన్నారు.
‘‘చేసిన పొరపాటును సరిదిద్దుకోవడం గొప్పనేతల లక్షణం.. మహాత్మాగాంధీ అదేవిధంగా చేశారు.. అలా చేయడం ప్రస్తుత రోజుల్లో కూడా సాధ్యమే.. తర్వాత ఏమి జరుగుతుందో వేచి చూడాలి’’ అంటూ కమల్ పేర్కొన్నారు.
తాను ఎప్పుడైనా పొరపాటు చేస్తే.. క్షమాపణలు చెప్పడానికి ఎప్పుడూ సంశయించలేదని తెలిపారు. పెద్దనోట్ల రద్దు వల్ల నల్లధనం నిర్మూలన జరుగుతందని భావించి మద్దతు ఇచ్చానని తెలిపారు. దాని వల్ల వచ్చే ఇబ్బందులు ప్రజలు ఓర్చుకోవాలని గతంలో తాను సూచించినట్లు చెప్పారు. దీని వల్ల చాలా మంది తన స్నేహితులు తనను క్రిటిసైజ్ చేశారని కమల్ తెలిపారు.డీమానిటైజేషన్ మంచిదేనని.. కాకపోతే దానిని సరిగా అమలు చేయలేదని తాను భావించానన్నారు. ఆ తర్వాత ఇదే విషయంపై పలువురు ఆర్థక వేత్తలు కూడా ప్రభుత్వాన్ని విమర్శించారని..దీనికి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదని ఆయన అన్నారు. అందుకే ఈ విషయంపై తొందరపడి మద్దతు తెలిపినందుకు తాను క్షమాపణలు చెబుతున్నానని కమల్ హాసన్ తెలిపారు.