పోలీస్ కార్యాలయంలోనే కానిస్టేబుల్ ఆత్మహత్య
కుటుంబ కలహాలతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఏకంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోనే ఈ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటంతో కలకలం రేగింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ వెంకటకిరణ్(28) సెంట్రీగా విధులు నిర్వహిస్తున్నాడు. 2009 సంవత్సరంలో విధుల్లో చేరినప్పటినుండి ఇక్కడే పనిచేస్తున్నాడు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సర్వీస్ తుపాకితో చాతిపై కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కానిస్టేబుల్ ఆత్మహత్యపై విషయం తెలుసుకున్న డీఎస్పీ మాసూమ్భాష సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు.