‘జియో’ కండిషన్లు వింటే.. దిమ్మ తిరగాల్సిందే..!
- ఇటీవలే విడుదలైన జియో ఫోన్లు
- దిమ్మతిరిగే కండిషన్లు పెట్టిన రిలయన్స్ జియో
- మూడు సంవత్సరాలు రీఛార్జ్ తప్పనిసరి
టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో ఫోన్.. ఇటీవలే విడుదలైంది. ఈ ఫోన్ ని ఉచితంగా అందజేస్తామని రిలయన్స్ జియో సంస్థ మొదట్లో ప్రకటించింది. కాకపోతే.. అందుకు రూ.1500 చెల్లించాలని.. మూడేళ్లలో తమ సంస్థ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఒకే, ఉచితంగానే ఫోన్ వస్తోంది కదా.. మన డబ్బులు మనకు మూడేళ్లలో తిరిగి వస్తాయి కదా అని చాలా మంది భావించారు. ఇప్పటికి 60లక్షల మంది ఈ ఫోన్ ని బుక్ చేసుకున్నారు కూడా. వారిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 8లక్షల మంది ఉన్నారు.
ఈ నెల 24 నుంచి ఫోన్ల పంపిణీ కూడా ప్రారంభించేశారు. ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేయగానే.. కొన్ని కండిషన్లను కూడా విడుదల చేసింది. ఆ కండిషన్లు వింటే దిమ్మ తిరిగిపోతోంది. జియోఫోన్ పనిచేయాలంటే ఏడాదికి రూ.1500 రీఛార్జ్ చేసుకోవాలని జియో వెబ్సైట్లో పేర్కొన్నారు. ‘జియో ఫోన్ డెలివరీ అయిన నాటి నుంచి ఏటా రూ.1500 చొప్పున మూడేళ్ల పాటు రిఛార్జ్ చేసుకోవాలి.’ అని నియమనిబంధనల్లో స్పష్టం చేశారు.
ఒకవేళ రీఛార్జ్ చేసుకోకపోతే ఫోన్ను వాపస్ తీసుకునే హక్కు కంపెనీకి ఉంటుందట. మూడేళ్లు పూర్తి కాకుండా ఫోన్ వాపస్ చేయాల్సి వచ్చినా వినియోగదారులకే నష్టం. తొలి ఏడాదిలోనే ఫోన్ను తిరిగిస్తే.. కంపెనీ ఎటువంటి రీఫండ్ చేయదు. పైగా వినియోగదారుడే రూ.1500లతోపాటు జీఎస్టీ, ఇతర పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. 12-24 నెలల మధ్య ఫోన్ను వాపస్ చేస్తే రూ.1000, జీఎస్టీ ఇతర పన్నులు కలిపి చెల్లించాలి. 24-36 నెలల మధ్య వాపస్ చేస్తే రూ.500లతో పాటు జీఎస్టీ ఇతర పన్నులు చెల్లించాలి. మూడేళ్లు పూర్తయిన తర్వాత మాత్రమే సెక్యూరిటీ బాండ్ కింద తీసుకున్న మొత్తాన్ని కంపెనీ రీఫండ్ చేస్తుంది.
అంటే.. జియో ఫోన్ వల్ల వచ్చే లాభాల మాట అటు ఉంచితే.. నష్టాలే ఎక్కవ కనిపిస్తున్నాయి. ఫోన్ వాడకపోయినా తప్పనిసరిగా రీచార్జ్ చేయించాల్సిందే. ఈ కండిషన్లు అన్నీ ముందే చెప్పకుండా.. ఫోన్ విడుదల తర్వాత చెప్పి.. అందరినీ ఇరకాటంలో పడేశారు.