తన్నుకున్న ఇద్దరు పైలెట్లపై వేటు
- విమానంలో కొట్టుకున్న పైలెట్లు
- ఉద్యోగం నుంచి తొలగించిన జెట్ఎయిర్ వేస్
ఇద్దరు పైలెట్లు విమానంలో గొడవపడి.. పైలెట్లుగా ఉండాల్సిన వాళ్లు.. ప్రయాణికులుగా మారారు. వివరాల్లోకి వెళితే.. నూతన సంవత్సరం రోజున ( జనవరి 1,2018) లండన్ నుంచి ముంబయికి బయలు దేరిన జెట్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ విమానం 777 (9డబ్ల్యూ 119)లో ఓ సీనియర్ పైలట్, మరో సీనియర్ కోపైలట్ గొడవపడ్డారు. వారి ఘర్షణ చూసి.. విమానంలోని ప్రయాణికులంతా ఒక్కసారిగా కంగారుపడ్డారు. వారిద్దరి మధ్య వివాదం కాక్ పిట్ నుంచి బయటకు వచ్చి తన్నుకేనే వరకు దారితీసింది. దీంతో.. అప్రమత్తమైన ప్రయాణికులు.. వారిని శాంతింపజేశారు.
అనంతరం పైలెట్ విమానాన్ని సురక్షితంగా కిందకు దింపారు. కాగా.. విమానంలో జరిగిన ఘర్షణ విషయంపై జెట్ ఎయిర్ వేస్ విచారణకు ఆదేశించింది. అదే సమయంలో ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తీవ్రంగా స్పందించి ఆ ఇద్దరు పైలెట్ల లైసెన్స్లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వారిని ఉద్యోగం నుంచి కూడా తొలగించేశారు. కేవలం ప్రయాణికులుగా మాత్రమే వారు విమానం ఎక్కాలంటూ ఆదేశించారు కూడా. దీంతో పైలెట్లు కాస్తా.. ప్రయాణికులయ్యారు. దీనిపై జెట్ ఎయిర్ వేస్ అధికారులు మాట్లాడుతూ.. ఇలాంటి ఘనటలు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.