మహిళపై జేసీ వర్గీయుల హత్యాయత్నం
- మహిళపై హత్యాయత్నం
- జేసీ వర్గీయులే దాడి చేశారని బాధితురాలి ఆరోపణ
అనంతపురం జిల్లాలో జేసీ వర్గీయులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఓ మహిళను దారుణంగా హత్య చేసేందుకు ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి నియోజకవర్గంలోని అప్పేచెర్ల గ్రామంలో హరిప్రియ అనే అంగన్ వాడీ కార్యకర్తపై బుధవారం ఉదయం హత్యాయత్నం జరిగింది. ఆమె చేతిని నరికేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన హరిప్రియను స్థానికులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
కాగా.. జేసీ వర్గీయులే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని హరిప్రియ ఆరోపించారు. రెండేళ్ల కిందట హత్యకు గురైన వైసీపీ నేత విజయభాస్కర్ సోదరే ఈ హరిప్రియ. విజయభాస్కర్ హత్య కేసులో రాజీకి రావాలని గత రెండేళ్లుగా టీడీపీ వర్గీయులు తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని హరిప్రియ తెలిపారు. అందుకు అంగీకరించలేదనే తనపై దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం ఉండదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయభాస్కర్ హత్యకు సంబంధించిన కేసు కొద్దిరోజుల కిందట కోర్టులో విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెపై దాడికి పాల్పడ్డారు.