ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితుడు

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని భూవివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇంతకు ముందు ఓ చెరువు శిఖం భూమిని ఆక్రమించుకున్నాడని స్వయంగా ఆ జిల్లా కలెక్టర్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా యాదగిరిరెడ్డి మరో భూవివాదానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

 జనగామ పట్టణంలోని తన స్వంత స్థలంలో ఇల్లు కట్టుకోడానికి ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి అతడి అనుచరులు అడ్డుకుంటున్నారని నర్సిములు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. జనగామ-హైదరాబాద్ రోడ్డులో గల విలువైన తన స్థలంపై ఎమ్మెల్యే కన్నేశాడంటూ అదే స్థలంలో వున్న వేపచెట్టు ఎక్కి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తనకు న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే చెట్టు దిగుతానని లేదంటే తనకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదని బాధితుడు తెలిపాడు. పోలీసులు న్యాయం జరిగేలా చూస్తామని నచ్చజెప్పడంతో నర్సింహులు చెట్టుపై నుండి దిగాడు. దీంతో పోలీసులు బాధితుడు నర్సిములును పోలీస్ స్టేషన్ కు తరలించారు.