తెలంగాణా అసెంబ్లీ కొచ్చిన జగన్ ‘మైక్ కట్’
పక్క రాష్ట్రం లో ప్రతిపక్ష నేత మైక్ ఎన్నిసార్లు కట్ అవుతుందో చూడండి
ప్రతిపక్ష సభ్యులు అందునా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నపుడు మైక్ కట్ చేసే కొత్త సంప్రదాయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొదలయింది. ఇది చాలా కాలంగా కొనసాగుతూ వస్తూ ఉంది. కొత్త అసెంబ్లీలో కూడా కొనసాగుతూ ఒక సంప్రదాయమయింది. మంగళవారం నాడు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నపుడు, తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యే గడ్డి ఈశ్వరి మాట్లాడుతున్నపుడు మైక్ కట్ అయింది. ఇది మామూలు విషయమయిపోయింది కాబట్టి పునశ్చరణలో విశేషం లేదు.
అయితే, ఇలా ప్రతిపక్షనేత మైక్ పదే పదే కట్ కావడం పక్క రాష్ట్రాల వాళ్లుకూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పసిగట్టారు.
ఈ విషయం ఈ రోజు తెలంగాణా అసెంబ్లీలో ఇది ప్రస్తావనకు వచ్చింది.
తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ప్రతిపక్ష నాయకుడు జానా రెడ్డి,బిజెపి సభ్యుడు కిషన్ రెడ్డి నిరసన వ్యక్తం చేసినపుడు జగన్ మైక్ కట్ అవుతూ ఉండటం ప్రస్తావన కు వచ్చింది.
నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పక్క (ఆంధ్ర) రాష్ట్రంలో లాగా ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నపుడు మైక్ కట్ చేయడం లేదని తెలంగా ణా అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు కె జానారెడ్డికి గుర్తు చేశారు.
“పక్క రాష్ట్రం లో ఎల్ ఒ పి గారి (ప్రతిపక్ష నేత) మైక్ ఎన్నిసార్లు కట్ అవుతుందో చూడండి. ఎల్ ఒపి గారి మైక్ చాలా సార్లు కట్ అవుతూ ఉంది అక్కడ. ఇక్కడ జానరెడ్డి సూచన మేరకు సభ నడుపుతున్నాం. ఆయన ఎవరికి మైక్ ఇవ్వమంటే వాళ్ళకు ఇస్తున్నాం. మాకు ప్రతిక్షాలంటే గౌరవం,” అని హరీష్ రావు అనడం విశేషం.
మంగళవారం సభలో ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి సమయం ఇవ్వలేదని విపక్ష సభ్యులు సభలో గుర్తు చేసినపుడు హరీష్ ఈ వ్యాఖ్య చేశారు.
“సమయం ఇవ్వలేదని డిప్యూటీ స్పీకర్ను అవమానించేలా మాట్లాడటం సరికాదు. మహిళా డిప్యూటీ స్పీకర్ను గౌరవించాలి. మాట్లాడేందుకు ప్రతి సభ్యునికి డిప్యూటీ స్పీకర్ అవకాశమిచ్చారు. ప్రతిపక్షాలకు అన్ని విషయాల్లో ప్రాధాన్యం ఇస్తున్నాం. మెజారిటీ ఉన్న టీఆర్ఎస్ 25 నిమిషాలు మాట్లాడితే.. తక్కువ సభ్యులున్న కాంగ్రెస్కు 1.35 గంటల సమయం ఇచ్చారు. ఐదుగురు సభ్యులున్న బీజేపీకి 46 నిమిషాల సమయంవచ్చింది.” అని ఆయన అన్నారు.